పాలమూరుపై ఫోకస్..దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ మాస్టర్​​ప్లాన్​​

పాలమూరుపై ఫోకస్..దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ మాస్టర్​​ప్లాన్​​
  •     గత మార్చిలో జరిగిన టీచర్​ ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థి విజయం
  •     అక్టోబర్​ 1న పాలమూరులో ప్రధాని మోడీ బహిరంగ సభ
  •     ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలు

మహబూబ్​నగర్, వెలుగు : అసెంబ్లీ ఎలక్షన్లకు టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ హైకమాండ్​ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫుల్​ ఫోకస్​ పెట్టింది. హైదరాబాద్​కు సమీపంలో ఉన్న ఈ జిల్లాపై పట్టు సాధించడం ద్వారా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మెజార్టీ సీట్లను సాధించాలనే ప్లాన్​ చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్​ 1న మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

దక్షిణ తెలంగాణ జిల్లాలపై పట్టు కోసం..

ఈ ఏడాది మార్చిలో జరిగిన మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్​ టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఎ.వెంకట నారాయణ రెడ్డి (ఏవీఎన్​రెడ్డి) విజయం సాధించారు. రాష్ట్ర స్థాయి లీడర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో పర్యటించి, టీచర్లకు వారి సమస్యల పరిష్కారంపై భరోసా ఇవ్వడంతో రూలింగ్​ పార్టీ బలపర్చిన అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టారు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గర పడడంతో ఇదే ఫార్ములాను దక్షిణ తెలంగాణ అంతటా ఇంప్లిమెంట్​ చేయాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో దాదాపు మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన క్యాడర్​ ఉంది.

మిగతా చోట్ల క్యాడర్​లో జోష్​  నింపేందుకు హైకమాండ్​ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. డిసెంబర్​లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే చాన్స్​ ఉండడంతో పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా ప్రధాని సభలు నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఇందులోభాగంగా పాలమూరులో పీఎం సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాలమూరులో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి తదితరులు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

‘పాలమూరు’ స్కీంపైనే చర్చించే అవకాశం..

పీఎం ‘పాలమూరు’ స్కీంపైనే ప్రధానంగా మాట్లాడతారనే ప్రచారం  జరుగుతోంది. అసంపూర్తి ప్రాజెక్టును కేవలం ఎలక్షన్ల కోసమే బీఆర్ఎస్​ ఓపెన్​ చేసిందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తారు. సెంట్రల్​ స్కీంలను తమ స్కీములుగా చెప్పుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నట్లు తెలిసింది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ స్కీముల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారనే విషయాలను కూడా ఈ సభ ద్వారా మోడీ వివరిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

క్యాండిడేట్ల పేర్లు ఫైనల్​ చేసే అవకాశం..

ఈ నెల 4 నుంచి 10 వరకు బీజేపీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థిత్వాల కోసం అప్లికేషన్లు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,003 మంది అప్లై చేసుకున్నారు. ఇప్పటికే వడపోత కార్యక్రమం మొదలైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అప్లికేషన్లను డివైడ్​ చేశారు. ఇందులో ప్రధాని సభ నాటికి కొందరి పేర్లను కన్ఫాం చేయనున్నట్లు తెలిసింది. ఆ రోజు రిలీజ్​ చేసే ఫస్ట్​ లిస్టులో దాదాపు 60కి పైగా పేర్లుంటాయని చెబుతున్నారు. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థిత్వాలను కన్ఫాం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

సీఎం వచ్చిన వెళ్లి రెండు వారాలకే..

ఎలక్షన్​ ఏడాది కావడంతో బీఆర్ఎస్​తో పాటు కాంగ్రెస్​ పార్టీల లీడర్లు ఉమ్మడి జిల్లాలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ నార్లాపూర్​ వద్ద ‘పాలమూరు’ స్కీం మొదటి పంపును ప్రారంభించారు. ఆయన పర్యటించిన రెండు వారాల వ్యవధిలోనే ప్రధాని మోడీ కూడా పాలమూరు పర్యటనకు వస్తుండడం హాట్​ టాపిక్​గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్​ నుంచి రేవంత్​రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే, ఇతర రాష్ట్ర స్థాయి లీడర్లు సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు.

బీజేపీ కూడా క్యాడర్​లో జోష్​ నింపేందుకు జాతీయ లీడర్లను రంగంలోకి దింపుతోంది. కొద్ది రోజుల కింద కేంద్ర మంత్రి మహేంద్రనాథ్​ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. మేలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్​కర్నూల్​లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. 30న నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్​ అవుతుండడంతో ఆ పార్టీ క్యాడర్​లో ఫుల్​ జోష్​ నిండుకుంది.