ఎమ్మెల్సీ కవిత బహిరంగ క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్సీ కవిత బహిరంగ క్షమాపణ చెప్పాలి
  •  తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు

నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను అవమానించిన ఎమ్మెల్సీ కవిత వెంటనే బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు సూదగాని హరిశంకర్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వట్టె జానయ్యయాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్​చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ప్రొఫెసర్​జయశంకర్​సార్​అని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ పదవులను ఆశించకుండా ప్రత్యేక రాష్ట్రమే ఊపిరిగా పనిచేసిన జయశంకర్ సార్ ముమ్మాటికీ తెలంగాణ జాతిపితగా అందరూ గౌరవించుకుంటారని స్పష్టం చేశారు. రాజకీయ అవసరాల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజాన్ని అవమానించేలా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. 

పైగా సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సామాజిక తెలంగాణ రాకపోవడానికి ప్రధాన కారణం కల్వకుంట్ల కుటుంబమే అన్న చేదు నిజాన్ని దాచిపెట్టి, మళ్లీ కొత్త నాటకం మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి, త్యాగాలు అపారమైనవని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను విస్మరించి ఒక వ్యక్తిని జాతిపితగా కీర్తించడం చరిత్రను వక్రీకరించడమే అవుతుందని తెలిపారు. తక్షణమే కవిత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు. లేదంటే తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెబుతుందని జేఏసీ నేతలు హెచ్చరించారు.