ఖతార్లో ఇష్క్.. కాగజ్నగర్లో షాదీ
నేపాల్ అమ్మాయితో సిర్పూర్(టి) అబ్బాయి ప్రేమ పెళ్లి
కాగజ్ నగర్, వెలుగు: ఎల్లలు దాటిన ప్రేమకు నిదర్శనం ఈ ఫొటోలో కనిపిస్తున్న జంట. దేశాలు వేరైనా.. భాష, సంస్కృతీ సంప్రదాయాలు వేరైనా ప్రేమ ఇద్దరినీ ఒక్కటి చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన అచ్యుత్కుమార్ అరబ్దేశమైన ఖతార్లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అక్కడే ఓ కంపెనీ మేనేజర్గా పనిచేస్తున్న నేపాల్కు చెందిన రమీలతో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు ఓకే చెప్పినా.. వివాహానికి కరోనా అడ్డుపడింది. అబ్బాయి ఇంటికాడ పెళ్లి చేయాలని అనుకునే టైంలో కరోనా సెకండ్ వేవ్స్టార్ట్అయ్యింది. విమానాల రాకపోకలు ఆగిపోవడంతో పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది. కరోనా ఎఫెక్ట్తగ్గడంతో ఎట్టకేలకు అచ్యుత్ ఇటీవల ఇండియాకు వచ్చాడు. కానీ వధువు నేపాల్లోనే ఉండిపోయింది. వెడ్డింగ్ కార్డుతో సహా భారత ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నా యువతి కుటుంబానికి పర్మిషన్ ఇవ్వలేదు. వధువుతో పాటు ఆమె తమ్ముడిని మాత్రమే అనుమతించింది. దీంతో వరుడి మేనమామ, మేనత్తలే రమీలకు అమ్మానాన్నలుగా మారి కన్యాదానం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం కాగజ్నగర్లో మూడు ముళ్ల బంధంతో అచ్యుత్ కుమార్, రమీల ఒక్కటయ్యారు.