
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పాల్వంచలో ఏర్పాటు చేయనున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెడుతూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాల్వంచలోని మైనింగ్ కాలేజీని అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మార్చిందని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా 300 ఎకరాల్లో ఎర్త్ సైన్సెస్ రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ యూనివర్సిటీతో జిల్లాకు మహర్దశ పట్టనుందని తెలిపారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెడ్తూ క్యాబినెట్ ఆమోదించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు తుమ్మలతో పాటు ఎమ్మెల్యే కూనంనేని కృతజ్ఞతలు తెలిపారు.