
వెలుగు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రగతిభవన్ లో రాజకీయ కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందని, దాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని సీఈఓ రజత్ కుమార్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం అనేది ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి 22 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2.95 కోట్లు ఉండగా, శుక్రవారం వరకు ఫారం-6 కింద 3.38 లక్షల మంది ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వాటిలో 1.55లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మూడు కోట్లకు చేరువగా తెలంగాణ ఓటరు జాబితా ఉండొచ్చని చెప్పారు. వీరందరికీ 28వ తేదీ వరకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామన్నారు. కొత్త ఓటర్లకు ఉచితంగా ఎపిక్ కార్డులిస్తామని, ఇతరులు మీ సేవ కేంద్రంలో రూ.25లు చెల్లించి తీసుకోవచ్చన్నారు. ఓటరు లిస్టులో పేరున్న వారు ఫొటో గుర్తింపుకార్డుతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఏపీ ఓటరు డాటా కేసు పోలీసు విచారణలో ఉందన్నారు.
20 నియోజకవర్గాల్లో ఎలక్షన్ పిటిషన్లు
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గా ల్లో 20 నియోజకవర్గాల ఫలితాలపై హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లు ఉన్నట్లు సీఈవో చెప్పారు. దీంతో అక్కడ ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను వాడడం లేదన్నారు. 14 జిల్లాల్లో ఈసీఐఎల్ఈవీఎం మిషన్స్ , 19 జిల్లాల్లో బీఈఎల్ ఈవీఎంలు వాడుతున్నట్టు తెలిపారు. కరీంనగర్ , సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట జిల్లాల్లో ఫస్ట్ లెవల్ చెకింగ్ స్ కొనసాగుతున్నాయని, యూపీ నుంచి ఈవీఎంలు రావడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో 34,603 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 54,953 బ్యాలెట్ యూనిట్లు (బీయూ), 40,038 కంట్రోల్ యూనిట్లు(సీయూ), 41,356 వీవీపాట్స్ అవసరం అవుతాయని అంచనా వేశామన్నారు. ఎన్నికల విధుల్లో 2.5 లక్షల మంది పాల్గొంటారని, పోలింగ్ నిర్వహణలో 1,85,500 మంది భాగస్వామ్యం అవుతారని చెప్పారు.
రూ.2.76 కోట్ల నగదు సీజ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రూ.2.76 కోట్ల నగదు సీజ్ చేసినట్లు సీఈవో తెలిపారు. 4,770 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నా మని, కోటి విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు తెలిపారు.