
- గోదావరి బోర్డు మీటింగ్ మినిట్స్పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం
- చర్చించని అంశాలనూ మినిట్స్లో పెట్టారని అసంతృప్తి
- తెలంగాణ లేవనెత్తిన అంశాలను మాత్రం చేర్చలేదని అసహనం
- జీఆర్ఎంబీకి ఈఎన్సీ అనిల్ ఘాటు లేఖ
హైదరాబాద్, వెలుగు: విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డు చైర్మన్కు సర్వాధికారాలు లేవని తెలంగాణ తేల్చి చెప్పింది. బోర్డు సభ్యుల (సభ్య రాష్ట్రాలు) ఆమోదం లేకుండా చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేరని స్పష్టం చేసింది. బోర్డులో సభ్యులైన రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం విచారకరమని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏప్రిల్ 7న నిర్వహించిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ)17వ బోర్డు మీటింగ్ మినిట్స్ను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్కు ఈఎన్సీ అనిల్ కుమార్ ఘాటుగా లేఖ రాశారు. ‘‘బోర్డు మీటింగ్లో బోర్డు మెంబర్ సెక్రటరీ లేదా సభ్యుల ప్రవర్తనపై చర్చించలేమని బోర్డు పేర్కొన్నది.
అది బోర్డు కేడర్ను నియంత్రించే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పింది. ఆ అంశాలను మినిట్స్ నుంచి తొలగించాలి” అని ఈఎన్సీ డిమాండ్ చేశారు. బోర్డును ఫుల్టైం చైర్మన్ నడపాల్సి ఉంటుందని మెంబర్ స్టేట్స్కు సమాచారమిచ్చారన్న వ్యాఖ్యలనూ డిలీట్ చేయాలన్నారు. బోర్డు వ్యవహారాల్లో రాష్ట్రాలు జోక్యం చేసుకుంటే బోర్డు పనికి ఆటంకం కలుగుతుందని మినిట్స్లో పేర్కొన్న వాక్యాన్ని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ఆఫీసు సెటప్కు అనుగుణంగానే బోర్డు ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చైర్మన్ ఏకపక్షంగా మెంబర్ స్టేట్స్కు చెందిన ఉద్యోగులను నియమించుకోవడం ఆమోదనీయం కాదన్నారు.
చర్చించని అంశాలూ మినిట్స్లో..
బోర్డు మీటింగ్ లో చర్చించిన పూర్తి అంశాలను మినిట్స్లో పొందుపరచలేదని, అదే సమయంలో మీటింగ్లో చర్చించని అంశాలను సైతం మినిట్స్లో పెట్టారని ఈఎన్సీ అనిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చించని అంశాలను మినిట్స్నుంచి తొలగించాలని డిమాండ్చేశారు. మెంబర్ స్టేట్గా తాము పేర్కొన్న అంశాలను మినిట్స్లో పెట్టలేదని, వాటినీ మినిట్స్లో చేర్చాలన్నారు. విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోర్డు పనిచేయాల్సి ఉంటుందని, కానీ బోర్డుకే అన్ని అధికారాలుంటాయని చెప్పడం సరికాదన్నారు. బోర్డులో అదనపు పోస్టులపై కమిటీకి రిఫర్ చేయాలన్న అంశాన్ని చర్చించేది లేదంటూ ఏకపక్షంగా చైర్మన్ నిర్ణయం తీసుకోలేరని తేల్చి చెప్పారు.
బోర్డు వర్కింగ్ మాన్యువల్పై బోర్డు మెంబర్స్ లేవనెత్తిన అభ్యంతరాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కాబట్టి వర్కింగ్ మాన్యువల్ను బోర్డు సభ్యుల పరిశీలనకు పంపాలని పేర్కొన్నారని.. దానినీ మినిట్స్ నుంచి తొలగించాలన్నారు. 17వ బోర్డు మీటింగ్లో చర్చించిన అంశాలను మినిట్స్లో పూర్తిగా చేర్చలేదని, దీనిపై వచ్చే బోర్డు మీటింగ్లో చర్చించాలని ఈఎన్సీ డిమాండ్ చేశారు.