
- పెరుగుతున్న స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్టు క్లాస్ రూమ్స్ కట్టండి
- మధ్యాహ్న భోజనం కోసం సోలార్ కిచెన్లు
- సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సులకు డిమాండ్ ఎందుకు లేదు?
- ఐఐటీల్లో అన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్లే రాష్ట్ర ఇంజినీరింగ్ కాలేజీల్లో ఉండాలి
- వచ్చే నెల మొదటి వారంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారంలో కనీసం రెండు ప్రభుత్వ స్కూళ్లను అడిషనల్ కలెక్టర్లు సందర్శించాలని ఆయన సూచించారు. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేశారు. ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో 48వేల మంది విద్యార్థులు చేరారని అధికారులు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లలో కొత్త రూమ్స్ను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను స్కూళ్లలో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యి బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని.. ఈ దిశగా సౌర వంటశాలల (సోలార్ కిచెన్ల) ఏర్పాటుపై వెంటనే దృష్టి పెట్టాలన్నారు.ఔటెన్త్ క్లాస్లో పాస్ అవుతున్న స్టూడెంట్ల సంఖ్యకు, ఇంటర్లో నమోదవుతున్న స్టూడెంట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడంపై అధికారులను సీఎం ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఇంటర్మీడియెట్లో చేరేలా చూడాలన్నారు. ఇంటర్ అనంతరం జీవనోపాధికి అవసరమైన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని, తద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ అడ్మిషన్లపై చర్చ
ఇంజినీరింగ్ అడ్మిషన్లపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ నెలాఖరు వరరకూ ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు కోసం ఏఐసీటీఈ గడువు ఉందని, రాష్ట్రం నుంచి ఇంకో నాలుగు కాలేజీలకు గుర్తింపు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. అయితే ఇంజనీరింగ్ కాలేజీల జాబితా రాగానే.. వచ్చే నెల మొదటి వారంలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం సూచించారు. స్టూడెంట్లు కేవలం కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్, ఐటీ వంటి కోర్సులకే ప్రాధాన్యం ఇవ్వడంపైనా ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్లపై ఎందుకు ఆసక్తి చూపించడం లేదని, దానికి కారణాలు ఏమిటని అధికారులను ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఐఐటీల్లో అన్ని కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉందని.. మరి రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో అలా ఎందుకు ఉండటం లేదని సీఎం ప్రశ్నించారు. దీనిపై పూర్తి నివేదికను అడిగారు. ఏం చేస్తే అన్ని కోర్సులకు ఆ స్థాయిలో డిమాండ్ ఉంటుంది? ఆయా కోర్సులను పూర్తి చేసిన తర్వాత భవిష్యత్ ఉండటం లేదా? ఏం చేయాలి.. అనేదానిపై సమగ్ర యాక్షన్ ప్లాన్ తీసుకురావాలని సీఎం సూచించారు. దీంతో పాటు కొత్త జిల్లాలకు డీఈవో పోస్టులు, డిప్యూటీ ఈవో పోస్టుల మంజూరుపైనా చర్చించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.