తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సాగుకోసం వ్యవసాయశాఖ కార్యాచరణపై కేసీఆర్ చర్చించారు. ధాన్యం సేకరణ, అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో చర్చించారు. మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అంచనా వేయండి
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది. ధాన్యం తడిసిపోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతినటంపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు తెప్పించాలని సూచించారు.
రైతుల ఆందోళన
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టం సంభవించింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీట మునిగి నష్టపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.