
తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. వివిధ రంగాల్లో ప్రావీణ్యం కనపరచి కేంద్ర ప్రభుత్వంనుంచి పద్మశ్రీ అందుకున్న తెలంగాణకు చెందిన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్, ఉమా మహేశ్వరి లకు సచివాలయంలో సీఎం రేవంత్ రూ.25 లక్షల చెక్కును అందించారు.. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపారు.
కవులు, కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లేదంటే మన భాష, సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. భాష, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డుల గ్రహీతలను సన్మానించారు. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే పద్మశ్రీ అవార్డుల గ్రహీతలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఇది ఇలాగే కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.