
- ప్యాక్స్ కంప్యూటరైజ్లో రాష్ట్రమే టాప్
- సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్)ను కంప్యూటరైజ్ చేశామని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. కంప్యూటరైజేషన్ ప్రక్రియలో మన రాష్ట్రమే టాప్-లో ఉందన్నారు. గురువారం బీఆర్కే భవన్లో కో -ఆపరేటివ్ క్రెడిట్ సంస్థల పర్యవేక్షణపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకుల పనితీరును మీటింగ్-లో సీఎస్ సమీక్షించారు. సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి బ్యాంకర్లు దృష్టి సారించాలని సీఎస్ సోమేశ్ కోరారు. రాష్ట్రంలో వ్యాపార పరిమాణాన్ని పెంచుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్వహణ లాభం 2022 మార్చి 31 నాటికి రూ.100.89 కోట్లుగా ఉందని వెల్లడించారు.
పోయిన ఏడాది లాభం(రూ.59.38 కోట్ల)తో పోలిస్తే 69.90 శాతం పెరిగిందని వివరించారు. అలాగే నికర లాభం రూ.77.29 కోట్లుగా ఉందని చెప్పారు. వ్యవసాయ సహకార బ్యాంకు వ్యాపార లావాదేవీలు గతేదితో పోలిస్తే 22.8 శాతం పెరిగిందన్నారు. 2020–21లో డిపాజిట్లు రూ.5466.41 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.6941.95 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. వ్యవసాయ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, సహకార శాఖ కమిషనర్ ఎం.వీరబ్రహ్మయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కె.నిఖిల తదితరులు పాల్గొన్నారు.