పోలవరం ముంపుపై జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వేకు తెలంగాణ పట్టు

పోలవరం ముంపుపై జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వేకు తెలంగాణ పట్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలవరం ప్రాజెక్టు ముంపుపై జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేయాల్సిందేనని తెలంగాణ పట్టుబట్టింది. పోలవరం ప్రాజెక్టుతో తలెత్తే ముంపుపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇందులో తెలంగాణ ఈఎన్సీ (జనరల్‌‌‌‌‌‌‌‌) మురళీధర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. ‘‘పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 150 అడుగుల లెవల్‌‌‌‌‌‌‌‌లో నీళ్లుంటే 892 ఎకరాలు ముంపునకు గురవుతాయని మా అధ్యయనంలో తేలింది. దీనిపై జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేపట్టి వాస్తవ ముంపును నిర్ధారించాలి. ఈ ఏడాది జులైలో వచ్చిన భారీ వరదలతో భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక మండలాల్లోని 103 గ్రామాల్లో 40,446 ఎకరాలు మునిగిపోయాయి. భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపాడు, సారపాకలోని లోతట్టు ప్రాంతాలను ముంపు నుంచి రక్షించడానికి నిరంతరం నీటిని పంప్‌‌‌‌‌‌‌‌ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. పోలవరంలో గరిష్ట స్థాయి నీటిని నిల్వ చేస్తే దుమ్ముగూడెం ఆనికట్‌‌‌‌‌‌‌‌కు ఎగువన 36 వాగులు, కిన్నెరసాని నది, ముర్రేడువాగుల్లోని నీళ్లు గోదావరిలో కలువకుండా వెనక్కితంతాయి’’  అని చెప్పారు. జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వేకు ఏపీ గతంలో అంగీకరించిందని, దీనికి లోబడి ఉమ్మడి సర్వే చేయాలని కోరారు. 

ఉమ్మడి సర్వేకు మేం ఒప్పుకోం: ఏపీ 

ఉమ్మడి సర్వేకు తాము అంగీకరించలేదని ఏపీ వాటర్‌‌‌‌‌‌‌‌ రీసోర్సెస్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ శశిభూషణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వే అంటూ ఏదీ ఉండదన్నారు. తెలంగాణకు నచ్చినట్టు నివేదిక వచ్చే వరకు స్టడీ చేయాలా అని ప్రశ్నించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ ప్రాజెక్టుకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌లు రావడం అంటే పిల్లచేష్టలు కాదు కదా అన్నారు. ‘‘తెలంగాణ లేవనెత్తిన అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇస్తే పరిశీలించి సమాధానమిస్తామని పీపీఏ తెలిపింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని మాత్రమే సుప్రీం చెప్పింది. ఇప్పటికే దీనిపై రెండు మీటింగులు జరిగినా ఏకాభిప్రాయం రాలేదు. ఏకాభిప్రాయం కోసం త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తారు. భూసేకరణపై పీపీఏ సమావేశంలో చర్చించాం. రెండో దశలో 30 వేల నుంచి 40 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. అందుకోసం షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేస్తాం” అని చెప్పారు. సమావేశంలో తెలంగాణ సీఈలు మోహన్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణ్య ప్రసాద్‌‌‌‌‌‌‌‌, పీపీఏ, ఏపీ ఇంజనీర్లు పాల్గొన్నారు.