మృత్యు ఘోష నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు

మృత్యు ఘోష నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు

అది మాటల్లో వర్ణించలేని… వింటే తట్టుకోలేనంతటి మృత్యు ఘోష. కంటతడి పెట్టించిన రోదన. డెంగీ జ్వరం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఒకరితర్వాత మరొకరి ప్రాణాలను బలిగొంది. ముందు తండ్రి.. ఆ తర్వాత అతడి తండ్రి. అనంతరం అతడి కూతురు. వెంటనే ఆయన భార్య. ఇలా.. ఒకదాని తర్వాత మరో సంఘటన.. ఆ కుటుంబసభ్యుల గుండెల్ని చీల్చేసింది.  

మంచిర్యాల పట్టణం శ్రీశ్రీ నగర్ కు చెందిన తల్లి, తండ్రి, అక్క, తాత.. ఈ నలుగురూ 15 రోజుల వ్యవధిలోనే చనిపోయారు. ఒకరి తర్వాత మరొకరు డెంగీతో ప్రాణాలను కోల్పోయారు. చివరకు గర్భంలో ఉన్న బిడ్డను కూడా డెంగీ వదల్లేదు. పండంటి కొడుకుకు జన్మనిచ్చిన తల్లి ఆ కొడుకును కనులారా చూడకముందే కన్నుమూసింది. పుట్టిన బిడ్డకు సైతం డెంగీ రావడంతో మంచిర్యాలలో శ్రీ మహాలక్ష్మీ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. పుట్టిన బిడ్డకు డెంగీ రావడం ప్రపంచంలోనే అరుదు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఇలాంటి సమయంలో ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో డా. కుమార్ వర్మ అత్యంత సాహసం చేసి ఉచితంగా వైద్యం అందించి నవజాత శిశువును డెంగీ నుంచి కాపాడి వైద్య చరిత్రలో రికార్డు సృష్టించాడు. డెంగీ మహహ్మరితో ఆ కుటుంబంలో నలుగురు చనిపోయినా…. తాను పోరాడి ఆ బాలుడిని మృత్యుంజయిడిగా నిలిపాడు.

మంచిర్యాల శ్రీశ్రీ నగర్ లో గుడిమల్ల రాజగట్టు కుటుంబం ఉండేది. ప్రైవేట్ టీచర్ గా పనిచేసే రాజగట్టుకు ఇద్దరు పిల్లలు.  భార్య మళ్లీ ప్రెగ్నెన్సీ. ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటున్న రాజగట్టు కుటుంబాన్ని డెంగీ జ్వరం అంతం చేసింది. పగవాడికి సైతం ఇలాంటి పరిస్థితి రావద్దని అనుకునేంతటి విషాదం ఆ కుటుంబాన్ని కబళించేసింది. ఒకరు చనిపోయారని ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఆగే లోపే మరొకరు చనిపోయారు. ఆ కుటుంబసభ్యులు, బంధువుల కంటనీరు వరదే అయ్యింది. మంచిర్యాల జిల్లానే కాక యావత్ రాష్ట్రాన్ని కూడా.. అయ్యో పాపం.. ఆ కుటుంబానికి ఎంత కష్టమెచ్చింది అనుకునేలా చేశాయి ఆ మరణాలు. ఆ దేవుడిమీద కూడా నిందలు వేసేలా చేశాయి.

అక్టోబర్ 16న గుడిమల్ల రాజగట్టు కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్ లో డెంగీతో చనిపోయారు. అక్టోబర్ 20 రాజగట్టు తండ్రి ఈద లింగయ్య జ్వరంతో మరణించాడు. అక్టోబర్ 27 రాజగట్టు కూతురు శ్రీవర్షిణి డెంగీతో చనిపోయింది. శ్రీవర్షిణికి జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించారు కుటుంబసభ్యులు. ప్లేట్ లెట్స్ తగ్గాయని రిపోర్ట్స్ రావడంతో.. హాస్పిటల్ కు తీసుకెళ్లిన మరునాడే ప్రాణాలు కోల్పోయింది.  ఇది జరిగిన 3 రోజులకే.. అక్టోబర్ 30న రాజగట్టు భార్య సోనీ డెంగీతో బాధపడుతూ.. హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చనిపోయింది. అది సోనీకి డెలివరీ సమయం. డెలివరీ టైమ్ లో జ్వరం రావడంతో.. మంచిర్యాల, కరీంనగర్ డాక్టర్లు హైదరాబాద్ కు రెఫర్ చేశారు. అప్పటికే భర్తను, కూతురిని, మామను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న సోనీ… హైదరాబాద్ యశోదా హాస్పిటల్ లో అడ్మిట్ అయింది. అక్టోబర్ 28న అడ్మిట్ అయి 29న కొడుకుకు జన్మనిచ్చింది. కొడుకును కళ్లారా చూడకముందే 30న కన్నుమూసింది. తీవ్రమైన దుఃఖంతో… తల్లి సోనీ శవం.. శిశువుతో రాజగట్టు కుటుంబసభ్యులు మంచిర్యాలకు వచ్చారు. ఇప్పటికే నలుగురిని కోల్పోయి బాధలో ఉన్న వారికి మరో కోలుకోలేని దెబ్బ తాకింది. సోనీ జన్మనిచ్చిన బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడం ఆ కుటుంబసభ్యులకు మరింత బాధను పెంచింది. జ్వరంతో బాధపడుతున్న బాబును మంచిర్యాల శ్రీ మహాలక్ష్మీ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చేర్పించి తల్లి అంత్యక్రియలను పూర్తిచేశారు.

బాబు తరుపున హాస్పిటల్ లో ఎవరూ లేకున్నా డాక్టర్ కుమార్ వర్మ దగ్గరుండి బాబుకు వైద్యం అందించడం మొదలుపెట్టాడు. మూడు రోజులైనా బాబుకు జ్వరం తగ్గలేదు. జిల్లా ఏరియా ఆసుపత్రిలో డెంగీకి సంబందించిన ఏలిసా టెస్ట్ చేయించారు. డెంగీ పాజిటివ్ రావడం.. ముప్పైవేల నుంచి పదివేలకు ప్లేట్ లెట్స్ పడిపోవడంతో…. ఎలాగైనా పుట్టిన బిడ్డను కాపాడాలని గట్టిగా సంకల్పించుకున్నారు డాక్టర్ కుమార్ వర్మ. పదివేలకు ప్లేట్ లేట్స్ పడిపోవడంతో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నాలుగుసార్లు సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్ ఎక్కించారు. పదిహేడు రోజుల పాటు హాస్పిటల్ లో ప్రతి సెకన్ గమనిస్తూ… బాబుకు వైద్యం అందించారు. డాక్టర్ కుమార్ వర్మ తండ్రిగా… హాస్పిటల్ సిబ్బంది కుటుంబసభ్యులుగా బాబు ఆరోగ్యం బాగుపడేదాకా ఎంతో శ్రమించారు. డెంగీ జ్వరంతో పదిహేడు రోజుల పాటు పోరాడి మృత్యువును బాబు జయించేలా అద్భుతమైన చికిత్స అందించారు డాక్టర్ కుమార్ వర్మ.

డెంగీ సోకిన నవజాత శివువు వైద్యానికి ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లోని కార్పొరేట్ హాస్పిటల్ లో రూ.పదిలక్షల వరకైనా ఖర్చయ్యేది. అందులోనూ.. ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. కానీ డాక్టర్ కుమార్ వర్మ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా బాబుకు వైద్యం అందించాడు. టెస్ట్ లు ల్యాబ్, మెడికల్ అన్ని ఉచితంగానే చేశాడు. అనారోగ్యంతో ఉన్న బాబును పూర్తి ఆరోగ్యవంతునిగా కుటుంబసభ్యులకు అప్పజెప్పాడు. పుట్టిన బాబుకు డెంగీ రావడం ప్రపంచంలో చాలా అరుదని.. వైద్యశాస్త్రంలో నవజాత శిశువుకు డెంగీ కేస్ స్టడీస్ కూడా లేవని డాక్టర్ చెప్పారు. గర్భంలో ఉన్నప్పుడే తల్లి మాయ ద్వారా బిడ్డకు డెంగీ సోకిందనీ.. దీనిని వైద్యపరిభాషలో వర్టికల్ ట్రాన్స్ మిషన్ అంటారని చెప్పారు. చాలా రిస్క్ తీసుకుని పుట్టిన బాబు ప్రాణాలు కాపాడామని… ప్లేట్ లేట్స్ తగ్గినప్పుడు వెంటనే ప్లేట్ లెట్స్ అందించిన రెడ్ క్రాస్ వారి సహాయ సహకారం మరువలేనిదని డాక్టర్ చెప్పారు.

ఆ పసిగుడ్డు కూడా తమకు దక్కదనే అనుకున్నారు అంతా. కుటుంబసభ్యులను చంపేసిన డెంగీతో పోరాడేలా చేసి.. బాలుడికి ప్రాణం ప్రసాదించిన డాక్టర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని కుటుంబసభ్యులు, బంధువులు చెప్పారు. ఏం చెయ్యని నిస్సహాయ స్థితిలో ఉన్న తమకు… ధైర్యానిచ్చి బాబుకు ఉచితంగా వైద్యం అందించిన డాక్టర్ కుమార్ వర్మ రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోలేమంటున్నారు.