హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. కనీస మద్దతు ధర కింద రైతులకు రూ.3,166.31 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.
8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 8 లక్షల టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయగా, మిగిలిన 15 లక్షల టన్నులు దొడ్డురకం ధాన్యంగా ఉన్నట్లు తెలిపారు. రైతులకు వెంటనే చెల్లింపులు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు చెప్పారు. వానాకాలానికి సంబంధించి ఎఫ్సీఐకి 10 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కేటాయించినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సందేహాలు, సమస్యలపై రైతులు టోల్ ఫ్రీ హెల్ప్లైన్ 1967ను సంప్రదించాలని సివిల్ సప్లయ్స్ శాఖ సూచించింది.
