- క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం రాత్రి ఆయన ప్రజా భవన్లో క్రిస్మస్ వేడుకలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్రిస్మస్ పండుగ కావడంతో ఘనంగా జరుపాలని సూచించారు. పేద క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ, క్రిస్మస్ విందులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో ఇచ్చే విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్లోని 200 ఏరియాల్లో 500 మందికి చొప్పున రాష్ట్రంలోని మిగతా 95 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వెయ్యి మందికి చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లు ఇవ్వడంతో పాటు విందులు ఏర్పాటు చేయాలని వివరించారు. గిఫ్ట్ప్యాక్లో అందజేసే దుస్తుల నాణ్యతను డిప్యూటీ సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఒమర్జలీల్, ఎంసీఆర్హెచ్ఆర్డీ అడిషనల్ డైరెక్టర్ మహేశ్దత్ఎక్కా తదితరులు పాల్గొన్నారు.