క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌ స్కానింగ్‌‌‌‌లో 10 పోలీస్ స్టేషన్లకే 100 మార్కులు

క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌ స్కానింగ్‌‌‌‌లో 10 పోలీస్ స్టేషన్లకే 100 మార్కులు
  • సిటిజన్ క్యూఆర్​ కోడ్‌‌‌‌ స్కానింగ్‌‌‌‌తో పీఎస్​ల పనితీరుపై సమీక్ష
  • మిగతా పీఎస్​లు మరింత సిన్సియర్​గా పనిచేయాలి: డీజీపీ
  • అప్పుడే వంద శాతం మార్కులు వేస్తారని సూచన

హైదరాబాద్, వెలుగు: వివిధ కారణాలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు మరింత సిన్సియర్​గా సేవలందించాలని పోలీసులకు డీజీపీ జితేందర్  సూచించారు. మెరుగైన సేవలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 10 పోలీస్‌‌‌‌ స్టేషన్లకు మాత్రమే ఫిర్యాదుదారులు నూటికి నూరు శాతం మార్కులు వేశారని డీజీపీ తెలిపారు. ఇదే తరహాలో మిగతా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఎందుకు సాధ్యం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. సిటిజన్‌‌‌‌ ఫీడ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌  క్యూఆర్‌‌‌‌‌‌‌‌  కోడ్‌‌‌‌  స్కానింగ్‌‌‌‌  విధానం ద్వారా  పోలీస్ స్టేషన్లలో అధికారుల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నామని హెచ్చరించారు. స్టేషన్‌‌‌‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులు, ఇతరులు క్యూఆర్  కోడ్‌‌‌‌  స్కాన్  చేసి అందించే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. 

పోలీసుల పనితీరుపై సమీక్షా సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ యూనిట్లకు చెందిన స్టేషన్ హౌస్  ఆఫీసర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ.. స్టేషన్  హౌస్  ఆఫీసర్లు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే బాధితులు, ఫిర్యాదుదారులు 100‌‌‌‌‌‌‌‌ శాతం సంతృప్తి వ్యక్తం చేస్తారని అన్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే  వివిధ రకాల వ్యక్తుల నుంచి సిఫార్సులు తీసుకొస్తారని అన్నారు. ఫిర్యాదులను స్వీకరించి తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని సూచించారు. 

ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు రిజిస్టర్  చేయడం ద్వారా కేసుల సంఖ్య పెరుగుతుందనే భావన విడనాడాలని అన్నారు. కేసుల సంఖ్య పెరిగినప్పటికీ పోలీసు అధికారులెవ్వరూ స్టేషన్ హౌస్  ఆఫీసర్లను ప్రశ్నించరని సూచించారు. ఆపదలో ఉన్న బాధితులను రక్షించి దోషులకు శిక్షపడేలా చేయడమే క్రిమినల్  జస్టిస్  సిస్టం ఉద్దేశమని పేర్కొన్నారు. అడిషనల్  డీజీ మహేశ్  భగవత్  మాట్లాడుతూ.. క్యూఆర్  కోడ్​పై ప్రజలకు  మరింత అవగాహన కల్పించాలని సూచించారు. బక్రీద్  సందర్భంగా గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు.