ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. బయటకు రాకండి

ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. బయటకు రాకండి

తెలంగాణలో మూడురోజుల(సెప్టెంబర్ 21, 22, 23) పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, ములుగు, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. 

మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ వాతావరణ శాఖ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్పా బయటకు రాకండని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈరోజు(సెప్టెంబర్ 21) ఉదయం నుంచి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. అటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. గుడి హత్నూర్, ఇచ్చోడ, బోథ్ జైనథ్ మండలాల్లో రాత్రి(సెప్టెంబర్ 20) నుంచి తెల్లవారుజాము వరకు వాన పడింది. 

ALSO READ : దేవుడిని కూడా వదలరా : 11 కేజీల గణేష్ లడ్డూ కొట్టేసిన దొంగలు

కాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిన్న రాత్రి(సెప్టెంబర్ 20) నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు కోరుట్ల ప్రాంతంలో కూడా నిన్నటి నుంచి ముసురుతో కూడిన చిరుజల్లులు పడుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వివరించింది.