
హైదరాబాద్, వెలుగు: నేషనల్ సబ్ జూనియర్ రోయింగ్ చాంపియన్షిప్లో ఆతిథ్య తెలంగాణ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హుస్సేన్సాగర్ లేక్లో శనివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో రాష్ట్ర సెయిలర్లు మూడు గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ నెగ్గారు. సబ్ జూనియర్ గర్ల్స్ కాక్స్లెస్ ఫోర్ విభాగంలో విద్యాసాయి, ఆరుషి, గుండు గంగోత్రి, విద్యశ్రీతో కూడిన తెలంగాణ టీమ్ ఒక నిమిషం 51.3 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. యూత్ జూనియర్ డబుల్ స్కల్లో చిప్పా ధాత్రి, అరుపూల వర్షిత జోడీ 1 నిమిషం 51.4 సెకన్లలో టార్గెట్ చేరి గోల్డ్ నెగ్గింది.
సబ్ జూనియర్ బాయ్స్ క్వాడ్రపుల్ స్కల్ విభాగంలో నరేష్ చౌదరి, గడ్డం వివేక్, కాశబోయిన అభిజిత్, బనావత్ జశ్వంత్తో కూడిన టీమ్ కూడా బంగారు పతకం ఖాతాలో వేసుకుంది. సబ్ జూనియర్ డబుల్ స్కల్ లో అభిజిత్, వివేక్ సిల్వర్ నెగ్గారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, ఆసియా రోయింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సీపీ సింగ్ దేవ్, తెలంగాణ రోయింగ్ ప్రెసిడెంట్ మిథున్ రెడ్డితో కలిసి విన్నర్లకు మెడల్స్, ట్రోఫీలు అందజేశారు.