60 వేల బెల్టు షాపులతో దేశంలో తెలంగాణ ఫస్ట్: రేవంత్​

60 వేల బెల్టు షాపులతో దేశంలో తెలంగాణ ఫస్ట్: రేవంత్​

హైదరాబాద్​, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో తెలంగాణ బొందలగడ్డగా మారిందని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి  అన్నారు. ‘‘దేశంలోనే తెలంగాణ నంబర్​ వన్​ అని కేసీఆర్​ అంటున్నడు. ఔను.. 60 వేల బెల్టుషాపులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. వైన్​షాపుల టెండర్ల పేరుతో రూ. 2,500 కోట్లు కేసీఆర్​ కొల్లగొట్టిండు’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్​ హయాంలో ఔటర్​ రింగ్​రోడ్డును నిర్మిస్తే.. దాన్ని కేసీఆర్​ రూ.7,500 కోట్లకు తెగనమ్ముకున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్​ బుధవారం గాంధీభవన్​లో కాంగ్రెస్​లో చేరారు. 

పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​రావు ఠాక్రే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్​ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో ఎ.చంద్రశేఖర్​ కీలక పాత్ర పోషించారని, ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు.  చరిత్ర తిరగేసి చూస్తే కాంగ్రెస్​ ఏం చేసిందో కేసీఆర్​కు తెలుస్తుందని రేవంత్​ అన్నారు. ‘‘సాగునీటి ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్​ పార్టీనే. కాంగ్రెస్​ పార్టీ ఏం చేసిందో నాగార్జునసాగర్​ కట్ట మీద చర్చకు సిద్ధమా” అని కేసీఆర్​కు సవాల్​ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్​ రూ.లక్ష కోట్లు మింగారని ఆయన ఆరోపించారు. 

కామారెడ్డిలో ఇప్పటికీ 22వ ప్యాకేజీ పనులు పూర్తికాలేదని,  కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే.. అక్కడ కేసీఆర్​ అడుగుపెట్టాలన్నారు. ‘‘కాంగ్రెస్​ హయాంలో పదేండ్లలోనే పేదలకు 25 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చినం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చోట కేసీఆర్​ ఓట్లు అడగొద్దు..  కేసీఆర్​ డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన చోట మేమూ అడగబోం. కేసీఆర్​కు ఇదే నా సవాల్. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని తుంగలో తొక్కిండు” అని ఆయన మండిపడ్డారు. 

కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకున్నరు

‘‘కమ్యూనిస్టులను వాడుకున్న కేసీఆర్​.. ఆ తర్వాత కరివేపాకులా తీసిపారేసిండు” అని రేవంత్​ విమర్శించారు. బీజేపీతో ఉన్న బంధంతోనే కమ్యూనిస్టులను వదిలేశారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్​ మాట్లాడుతూ.. కేసీఆర్​ను, బీఆర్​ఎస్​ పార్టీని గద్దె దింపే సత్తా కాంగ్రెస్​ పార్టీకే ఉందని అన్నారు. ‘‘కేసీఆర్​ను ఓడించే సత్తా బీజేపీకి ఉందని భావించి ఆ పార్టీలో చేరిన. కానీ, అది సాధ్యం కాదని తేలడంతోనే కాంగ్రెస్​లో చేరుతున్న. రెండు నెలల కింద చేవెళ్లలో సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో నేను దళితుడినని చెప్పి అమిత్​ షా నేను తెచ్చిన శాలువాను తీసుకోలేదు. ఆ సభలో నాకు ఘోరంగా అవమానించారు” అని ఆయన పేర్కొన్నారు.