- తుదిదశకు చేరిన ‘గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు’
- జాబ్ నుంచి తొలగించాలంటే7 రోజుల ముందు నోటీసుఇవ్వాల్సిందే
- పని కేటాయింపులు, తొలగింపులో వివక్షకు చెక్ పెట్టేలా‘అల్గారిథమ్ ట్రాన్స్పరెన్సీ’
- వర్కర్లు, అగ్రిగేటర్ల మధ్య వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్.. ఆపైన అప్పీలేట్ అథారిటీలు
- 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు చేసేలా బిల్లును తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- త్వరలో కేబినెట్ ముందుకు..! యాక్ట్గా మారితే గిగ్ వర్కర్లకు సమగ్ర చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకువస్తున్నది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో కేబినెట్ముందుకు రానుంది. ‘తెలంగాణ ప్లాట్ఫామ్ -ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు --–-2025’ పేరిట రూపొందుతున్న ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. ఇకపై గిగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తిస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్, డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు గిగ్వర్కర్లు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వీరు కార్మిక చట్టాల పరిధిలోకి రాకపోవడంతో.. వారి పనిగంటలు, ఆదాయం, ఉద్యోగ భద్రత వంటి అంశాలను ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా చేయబోయే చట్టం వల్ల వారికి జాబ్ సెక్యూరిటీతో పాటు సంక్షేమానికి ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటవుతుంది. ఆరోగ్య బీమా, యాక్సిండెంట్ కవరేజీ, ఆదాయ భద్రత కోసం సంక్షేమ పథకాలు అమలవుతాయి.
సర్వే నిర్వహించి.. సమస్యలు తెలుసుకొని..!
గిగ్ వర్కర్ల బిల్లు రూపకల్పన నుంచి ఆమోదం వరకు ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకు వెళ్తున్నది. ముందుగా రాష్ట్రంలో 1,300 మంది గిగ్ వర్కర్లపై సర్వే నిర్వహించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా బిల్లులో పలు అంశాలు పొందుపరిచింది. 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్ల సంఘాలు, నిపుణులు, న్యాయవేత్తలతో ఆరుసార్లు సంప్రదింపులు చేపట్టి.. పలు మార్పులు చేర్పులు చేసింది. న్యాయశాఖ పరిశీలన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి మే 19 వరకు బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 66 సూచనలు, అభ్యంతరాలు అందగా.. వీటిలో చాలా అంశాలను బిల్లులో పొందుపరిచారు. కర్నాటక, జార్ఖండ్, రాజస్తాన్లో గిగ్వర్కర్ల చట్టాలను తెచ్చినా.. ఇంత సమగ్రంగా లేదని ఈ రంగలోని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
‘తెలంగాణ ప్లాట్ఫామ్- ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు -2025’ లోని విశేషాలు ఇవీ..
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం రవాణా (మొబిలిటీ), డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేస్తున్నారు. వీరు సాధారణంగా వారానికి 7 రోజుల పాటు రోజుకు 10 నుంచి-12 గంటల చొప్పున వర్క్ చేస్తున్నారు. వీరి ఆదాయంలో ప్లాట్ఫామ్లు 20% నుంచి 30% వరకు కమిషన్గా వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గిగ్వర్కర్లకు స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేకుండాపోవడం ప్రధాన సమస్యగా ఉంది.
తాజా బిల్లులో గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘తెలంగాణ ప్లాట్ఫామ్ -ఆధారిత గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు’ పేరుతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది.
అగ్రిగేటర్లకు (ఫ్లాట్ఫామ్ లు) చెల్లించే సొమ్ములో 1-–2% వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించనున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తరఫున సీఎస్ఆర్ఫండ్స్, విరాళాలు, గ్రాంట్లను ఈ నిధికి అందజేస్తుంది. ప్లాట్ఫామ్ల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనేది పర్యవేక్షించేందుకు రియల్-టైమ్ ‘వెల్ఫేర్ ఫండ్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ (డబ్ల్యుఎఫ్ఎఫ్ వీఎస్)’ అందుబాటులోకి తేనున్నారు.
స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఉబర్, ఓలా వంటి ప్లాట్ ఫామ్లు, కార్మికుల మధ్య తలెత్తే వివాదాలను ఇన్టైంలో పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పొందుపరిచింది. ఇందులో భాగంగా గిగ్ కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం, మోసాలు, అకారణంగా అకౌంట్లు సస్పెండ్ చేయడం.. లాంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారులను నియమిస్తారు. 100 మందికి పైగా కార్మికులు ఉండే ప్రతి పెద్ద ప్లాట్ఫామ్లో ‘అంతర్గత వివాద పరిష్కార కమిటీ’ని తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.
ఈ కమిటీల ద్వారా పరిష్కారం లభించకపోతే, పైస్థాయిలో అప్పీలేట్ అథారిటీకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బిల్లులో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. కార్మికులు లేదా ప్లాట్ఫామ్లు గ్రీవెన్స్ అధికారులు ఇచ్చిన నిర్ణయంపై సంతృప్తిచెందకపోతే వారు అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ అథారిటీ స్వతంత్రంగా విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది. తద్వారా కార్మికులకు న్యాయపరమైన భరోసా దక్కుతుంది.
చట్టం అమల్లోకి వస్తే ఆయా ప్లాట్ఫామ్లు ఇకపై ఉద్యోగులను అకారణంగా తొలగించలేవు. ఎవరైనా ఉద్యోగిని తొలగించాలంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. గతంలో ప్లాట్ఫామ్లు గిగ్ వర్కర్ల అకౌంట్లను ఒక్కసారిగా నిలిపివేసేవి. దీనివల్ల కార్మికులు ఉన్నఫళంగా రోడ్డునపడేవారు. తాజా బిల్లులో కస్టమర్ భద్రతకు ముప్పు కాని సందర్భాల్లో.. ఏ వర్కర్నైనా తొలగించాలంటే కనీసం ఏడు రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలనే నిబంధన పెట్టారు.
పని కేటాయింపు, తొలగింపు.. తదితర అంశాల్లో వివక్ష లేకుండా ఉండేందుకు, ప్లాట్ఫామ్లు ఉపయోగిస్తున్న అల్గారిథమ్లు పారదర్శకంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గిగ్ వర్కర్లకు పని కేటాయింపులు, బోనస్లు, రేటింగ్లు, అకౌంట్ సస్పెన్షన్లు పూర్తిగా సాఫ్ట్వేర్ అల్గారిథమ్పై ఆధారపడి నడుస్తున్నాయి. వీటిలో వివక్ష, అన్యాయానికి తావులేకుండా బిల్లులో ‘అల్గారిథమ్ ట్రాన్సపరెన్సీ’ని తప్పనిసరి చేస్తున్నారు. దీని ద్వారా కార్మికులు తమ పనిపై ప్రభావం చూపే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో తెలుసుకునే హక్కు పొందుతారు.
2047 నాటికి దేశంలో 6.16 కోట్ల గిగ్ వర్కర్లు
వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం వ్యవసాయేతర కార్మికశక్తిలో గిగ్ వర్కర్లు 2.6% (2020–21) మాత్రమే ఉన్నారు. కానీ 2047 నాటికి ఇది 14.89 శాతానికి పెరగనుంది. టెక్నాలజీ విస్తరణ, సౌలభ్యత, డిజిటల్ ప్లాట్ఫామ్లకు వస్తున్న ఆదరణ, ప్రాజెక్ట్ ఆధారిత ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తి లాంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. 2020–21 నాటికి దేశంలో సుమారు 77 లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారు.
2047 నాటికి ఈ సంఖ్య 6.16 కోట్లకు చేరుతుంది. ఇది ఏకంగా ఏడు రెట్ల వృద్ధి. ఇటు గిగ్ ఎకానమీ కూడా 2030 నాటికి దేశ జీడీపీలో 1.25%, 2047 నాటికి 4% వరకు వాటాకు చేరే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్, ఫుడ్ సప్లయ్ వంటి సంప్రదాయ రంగాలతోపాటు ఇప్పుడు హెల్త్కేర్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్, మార్కెటింగ్, డిజైన్, క్రియేటివ్ సర్వీసెస్ వంటి రంగాల్లో కూడా గిగ్ వర్కర్లకు భారీ అవకాశాలు వస్తున్నాయి. మహిళలు, యువత, టయర్ -2, టయర్ -3 నగరాల ప్రజలు ఈ రంగంలో కొత్తగా అడుగుపెడుతున్నారు.
