
- వైద్యులు, సిబ్బంది అటెండెన్స్ట్రాకింగ్కు నిర్ణయం
- బయోమెట్రిక్, లైవ్ లొకేషన్ పై సరైన మానిటరింగ్ లేదు
- నిర్మల్ జిల్లాలో 735 స్కూళ్లు, 4 టీవీవీపీ హాస్పిటళ్లు
నిర్మల్, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది, విద్యాశాఖలో పనిచేసే టీచర్ల అటెండెన్స్ పై సంబంధిత శాఖలు సీరియస్ గా దృష్టి సారించాయి. ప్రస్తుతం ఈ రెండింట్లో అమలవుతున్న హాజరు విధానం కఠినంగానే ఉన్నప్పటికీ ఉద్యోగులు, టీచర్లు, సిబ్బంది విధులను ఎగ్గొట్టడం ఆపడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో గత కొంతకాలంగా బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నారు. దీనిపై సరైన మానిటరింగ్ లేకపోవడంతో కొన్నిచోట్ల కొంతమంది డాక్టర్లు, సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
అనుమతి తీసుకోకుండా సెలవులు పెట్టడం, డ్యూటీల సమయం ముగియకముందే మధ్యలోనే వెళ్లిపోవడం, ఆలస్యంగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేస్తుండడం పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. ఈ కారణంగా చాలా హాస్పిటల్స్ లో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పలువురు అంటున్నారు. నిర్మల్జిల్లాలో 735 ప్రభుత్వ పాఠశాలలు, 4 తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) హాస్పిటళ్లు ఉన్నాయి.
షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు
డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ పైనే కాకుండా విధుల ఎగవేత, డ్యూటీ సమయాల్లో డుమ్మా కొట్టడం వంటి అంశాలపై వైద్యశాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వైద్య విధాన పరిషత్ రాష్ట్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్ ను ట్రాకింగ్ చేయాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా మానిటరింగ్ విధానం అమలు చేస్తోంది. ప్రతీరోజు ఉదయం 11 గంటలకు బయోమెట్రిక్ అటెండెన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను హెడ్ ఆఫీస్ కు ఆన్ లైన్ లో పంపించాలంటూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
పర్మిషన్ లేకుండా లీవ్ పెట్టడం, ఆలస్యంగా విధులకు వచ్చేవారితోపాటు మధ్యలోనే బయటకు వెళ్లేవారి వివరాలను ఆస్పత్రుల నోడల్ఆఫీసర్లు ఇవ్వాలని పేర్కొంది. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు, మెడికల్ ఆఫీసర్లకు సూచించింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా గూగుల్ ఫామ్ ను కూడా వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ చేశారు.
సిగ్నల్ పేరిట లైవ్ లొకేషన్ దాటవేత!
ప్రస్తుతం టీచర్ల హాజరును లైవ్ లొకేషన్ సిస్టంతో పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలలో ప్రార్థన సమయాన్ని కన్నా ముందే ప్రతీ టీచర్ సెల్ ఫోన్ లో తన లైవ్ లొకేషన్ హాజరు రూపంలో నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశాల సమయం ముగిసేవరకు దీన్ని ఆన్ లోనే ఉంచాలి. కానీ మారుమూల గ్రామాల్లోని కొంతమంది ఉపాధ్యాయులు సిగ్నల్ సరిగా రావడం లేదని లైవ్ లొకేషన్ ను దాటవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొందరు పాఠశాలలకు వచ్చి లైవ్ లొకేష న్ ను నమోదు చేసిన అనంతరం తమ ఫోన్లో నెట్ ఆఫ్ చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. పలువురు టీచర్లు లైవ్ లొకేషన్సిస్టంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఇష్టారాజ్యంగా పాఠశాలకు దూరంలో ఉండి లైవ్ లొకేషన్ పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
మొదట్లో లైవ్ లొకేషన్ ను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి సరైన పర్యవేక్షణ లేదన్న విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వం లైవ్ లొకేషన్ తోపాటు ఫేషియల్ రికగ్నైజేషన్(ఎఫ్ఆర్) విధానం తీసుకురానుంది. ఇప్పటికే విద్యార్థుల హాజరును ఈ విధానంతో అమలు చేస్తుండగా ఇకనుంచి టీచర్లు కూడా తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును మండలాల వారీగా పర్యవేక్షించేందుకు ఎమ్మార్సీలలో ట్రాకింగ్ విభాగం ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయాలతో డుమ్మా టీచర్లు, డాక్టర్లకు చెక్పడనుంది.