వెంటిలేటర్లు ఉన్నా వాడట్లే.. మూలకు పడేసిన సర్కార్

వెంటిలేటర్లు ఉన్నా వాడట్లే.. మూలకు పడేసిన సర్కార్
  • ఫిట్‍ చేయకుండా మూలకు పడేసిన రాష్ట్ర సర్కార్​
  • ఏడాది కింద కేంద్రం నుంచి 1,400 వెంటిలేటర్లు రాక
  • సగం కూడా సీల్​ తీయలే.. ఎంజీఎంలో 100కు 36 వాడకం
  • సంగారెడ్డిలో కార్టన్లను కూడా ఓపెన్​ చేయలే
  • సూర్యాపేటలో 20 వృథాగా ఉన్నయ్​

వరంగల్‍ రూరల్‍ / నల్గొండ / సంగారెడ్డి, వెలుగు:  రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నా.. కండ్లముందే పేషెంట్లు శ్వాస అందక పిట్టల్లా రాలుతున్నా.. అందుబాటులో ఉన్న వెంటిలేటర్లను వాడుకోవడంలో రాష్ట్ర సర్కార్​ ఫెయిల్‍ అవుతోంది.  పీఎం కేర్స్​ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 1,400 వెంటిలేటర్లు ఇస్తే వాటిలో సగానికిపైగా వెంటిలేటర్లు గవర్నమెంట్​ హాస్పిటళ్ల​లో ఫిట్టింగ్​కు నోచుకోక మూలనపడి ఉన్నాయి. వాటిని ఆపరేట్​ చేసే అనస్థీషియా టెక్నీషియన్లు లేక అందుబాటులోకి రావడం లేదు. వారిని రిక్రూట్​ చేయాల్సిన రాష్ట్ర సర్కారు స్పందించడం లేదు.  

కార్టన్లనూ తెర్వలే
దేశవ్యాప్తంగా గతేడాది కరోనా వణికించిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్‍ స్కీంలో భాగంగా రాష్ట్రానికి 1,400 వెంటిలేటర్లు అందించింది.  ఒక్కో వెంటిలెటర్‍ ఖర్చు ఎంత తక్కువ అనుకున్నా రూ. 50 లక్షలు ఉంటుంది. అందులో వరంగల్‍ ఎంజీఎంకు 100, ఆదిలాబాద్‍ రిమ్స్ కు100, సూర్యాపేటకు 40, సిద్దిపేటకు15, మహబూబాబాద్​కు 12, కరీంనగర్​కు 10, నిజామాబాద్‍ కు 10, జోగులాంబ గద్వాలకు 9, రాజన్న సిరిసిల్ల కు 8, జనగామకు 8, జగిత్యాలకు 8, మంచిర్యాల –బెల్లంపల్లికి 7, ఆసిఫాబాద్‍ కు 5, కామారెడ్డికి 4, నాగర్‍కర్నూల్‍ జిల్లా ఆసుపత్రికి 3.. ఇట్ల రాష్ట్రానికి మొత్తం 1,400 వెంటిలేర్లను కేంద్రం పంపించింది. కానీ చాలా జిల్లాల్లో వెంటిలేటర్లను మూలకుపడేశారు. సంగారెడ్డి లోని పెద్దాసుపత్రికి 20 వెంటిలేటర్లు రాగా, ఆ కార్టన్లను ఇప్పటివరకు ఓపెన్​ చేయలేదు. వీటిని వినియోగంలోకి తేవాలంటే అదనంగా పది మంది సీనియర్ నర్సులు, నలుగురు పల్మనాలజిస్టులు, ఏడుగురు అనస్థీషియా టెక్నీషియన్స్ అవసరమని జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ కె. సంగారెడ్డి గత నెల ఏప్రిల్ లో జిల్లా కలెక్టర్ కు  ప్రపోజల్స్​ పంపారు. కానీ ఇప్పటికీ రెస్పాన్స్​ రాలేదని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి పీఎం కేర్స్ కింద 40 వెంటిలేటర్లు రాగా, సరిపడా టెక్నీషియన్స్​ లేక 20 వెంటిలేటర్లను వాడడం లేదు. ఈ హాస్పిటల్​లో మే 7న11మంది, 8న ఆరుగురు, 9న నలుగురు, 10 న ఐదుగురు కరోనా తో చనిపోవడం వెనుక సరిపడా వెంటిలేటర్లు లేకపోవడమే కారణమనే ఆరోపణలు వచ్చాయి.  నల్గొండలోని టీచింగ్ హాస్పిటల్​నే తీసుకుంటే ఇక్కడ పీఎం కేర్స్​ కింద 38 వెంటిలేటర్లు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఫిటింగ్​ చేయలేదు. సివియర్​ పేషెంట్లు పెరుగుతుండటంతో 10 వెంటిలేటర్లనైనా వినియోగంలోకి తీసుకురావాలని ఆఫీసర్లు చర్యలు ప్రారంభించారు. వెంటిలేటర్లు వాడుకునే ఫెసిలిటీ ఉన్నా వాటిని ఫిట్టింగ్ చేసే ప్లగ్గులు మార్కెట్‌లో దొరకలేదు. వాటి కోసం టెక్నిషియన్లు ఇప్పటికే పలుసార్లు హైదరాబాద్, చెన్నై వెళ్లివచ్చారు. కానీ దొరకలేదని తెలిసింది.

ఎంజీఎంలో ముగ్గురే టెక్నీషియన్లు 
వరంగల్‍ ఎంజీఎం హస్పిటల్‍కు పీఎం కేర్స్‌ నుంచి ఏడాది కింద సెంట్రల్‍ గవర్నమెంట్‍ 100 వెంటిలేటర్లు కేటాయించింది. అందులో 36 వెంటిలేటర్లనే వాడుతున్నారు.  హాస్పిటల్​లో సకాలంలో ఆక్సిజన్‍ అందక, వెంటిలేటర్‍ దొరక్క చాలా మంది మరణించారు. ఇప్పటికీ రోజుకు 20 ప్రాణాల దాకా పోతున్నాయి. గత 20 రోజుల్లో మంత్రులు పలుమార్లు రివ్యూలు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. 800 బెడ్లు, 650 ఆక్సిజన్‍ బెడ్లు.. 100 వెంటిలెటర్లు రెడీ ఉన్నట్లు చెబుతున్నారు. కానీ అధికారుల లెక్కల ప్రకారం 36  వెంటిలేటర్లే పని చేస్తున్నాయి. 74 వెంటిలెటర్లు మూలకుపడేశారు. ఒక్కో వెంటిలేటర్‍ కోసం రోజూ  వందలమంది కాళ్లవేళ్లా పడుతుంటే..  ఉన్నవాటిని వినియోగంలోకి తేకుండా జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 110 వెంటిలెటర్లకు కనీసం 50 మంది టెక్నిషియన్లు అవసరం ఉండగా.. కేవలం 3 మాత్రమే సర్వీస్‍ ఇస్తున్నారు.  

స్టాఫ్​లేకే వాడుకోలేకపోతున్నం 
టెక్నీషియన్లు స్టాఫ్​ లేక సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో 20 వెంటిలేటర్లు పక్కనపెట్టినం. కరోనా పేషెంట్లు అత్యవసర పరిస్థితుల్లో వస్తే 2 గంటలు ఆక్సిజన్ పెట్టి​ గాంధీకి రెఫర్​ చేస్తున్నాం.  ఒక వెంటిలేటర్ కు టెక్నీషి యన్​తో పాటు 8 మంది స్టాఫ్​ అవసరం. సిబ్బంది కొరత వల్లే ఏడాదిగా వాడ్తలేము. 
- కె. సంగారెడ్డి, సూపరింటెండెంట్, సంగారెడ్డి జిల్లా హాస్పిటల్‌  

ఏడాదిగా టెక్నీషియన్లను రిక్రూట్‍ చేయలె
వెంటిలేటర్లు ఉన్నా వాటిని అపరేట్​ చేయడానికి అవసరమైన అనస్థీషియా టెక్నీషియన్లను  ఏడాదిగా  రాష్ట్ర ప్రభుత్వం నియమించడం లేదు. ఒక టెక్నీషియన్​ దాదాపు మూడు వెంటిలేటర్లను పర్యవేక్షించే చాన్స్​ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,400 వెంటిలేటర్లు నడవాలంటే షిఫ్టులవారీగా తక్కువలో తక్కువ వెయ్యి మందికి పైగా టెక్నీషియన్లు అవసరం. కానీ రాష్ట్రమంతా వంద మంది కూడా లేరని తెలుస్తోంది. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కయిన ఎంజీఎంలోనే ముగ్గురు టెక్నీషియన్స్​ ఉన్నారంటే  పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి రివ్యూల్లో ఈ అంశాన్ని ఆఫీసర్లు, డాక్టర్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువస్తున్నా రిక్రూట్‍మెంట్​ మాత్రం జరగలేదు.