జీహెచ్ఎంసీకి సర్కార్ బకాయిలు రూ. 678.64 కోట్లు

జీహెచ్ఎంసీకి సర్కార్ బకాయిలు రూ. 678.64 కోట్లు
  • ఏడేండ్లుగా ప్రభుత్వ భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ లు పెండింగ్
  • లిస్టులో ప్రగతి భవన్ నుంచి చిన్న చిన్న ఆఫీసుల వరకు..

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు అన్ని పెండింగ్​లోనే ఉన్నాయి. గత ఏడేండ్లుగా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.678.64 కోట్లు బకాయి పడింది. పన్నుల కోసం రాష్ట్ర బడ్జెట్​లో కేటాయిస్తున్న నిధులను కూడా చెల్లించడం లేదు. ఈ ఏడేండ్లలో కేవలం రూ.35 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వ భవనాలు, ఇతర సంస్థలకు చెందిన భవనాల పన్నులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ జీహెచ్ఎంసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆస్తి పన్ను సక్రమంగా విడుదల కావడం లేదని బల్దియా వర్గాలు అంటున్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 2,500 వరకు ప్రభుత్వ ఆస్తులున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వాటి ద్వారా ప్రతి ఏటా రూ.102.54 కోట్ల పన్ను డిమాండ్ ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ సందర్భంలో ఆస్తుల వివరాలు పన్ను డిమాండ్​తో కూడిన వివరాలను  బల్దియా ప్రభుత్వానికి అందిస్తుంది. అంతేకాకుండా తమకు రాష్ట్ర ప్రభుత్వ భవనాలపై రూ.102 కోట్లు ఆస్తి పన్ను రూపంలో వస్తాయని జీహెచ్ఎంసీ బడ్జెట్​లో సైతం పెట్టుకుంటుంది. ఇలా గడిచిన ఏడేండ్లుగా రాష్ట్ర  ప్రభుత్వం నుంచి రూ.714 కోట్ల వరకు ఆస్తి పన్ను రావాల్సి ఉంది.

ప్రగతిభవన్ కట్టినప్పటి నుంచి పన్నే కట్టలే..

రాష్ట్ర ప్రభుత్వం భవనాల్లో ఇటీవల కూల్చిన సచివాలయ భవనం, రాజ్ భవన్​లోని నిర్మాణాలతోపాటు  సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్ కు కూడా ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయి. ప్రగతి భవన్​కు సంబంధించి ప్రతి ఏటా 5 లక్షల 28 వేల 90 రూపాయల ఆస్తి పన్ను చెల్లించాలి.  2018–-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు ప్రగతి భవన్​ది పెనాల్టీతో కలిపి 25 లక్షల 49 వేల 914 రూపాయలు జీహెచ్ఎంసీకి పన్ను బకాయి ఉంది. అంటే ప్రగతి భవన్  నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి అసలు ఆస్తి పన్ను చెల్లించనే లేదు.

జీహెచ్ఎంసీ అప్పుల మిత్తే రోజుకు కోటి..

ప్రతి ఏటా రూ.102 కోట్లు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటూనే ఉంది. అయినా సర్కార్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. బడ్జెట్​లో కేటాయించిన కొద్ది నిధులు కూడా ఇవ్వడం లేదు. మరోవైపు బల్దియా చేసిన అప్పుల మిత్తికే రోజుకు రూ.కోటి చెల్లిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ వేడుకుంటోంది.