
- ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ ఆగమాగం!
- బల్దియాకు పలు ఫిర్యాదులు
- తొందరపాటులో లో క్వాలిటీ, తక్కువ క్వాంటిటీ, ఎక్స్పైరీ ఐటమ్స్డెలివరీ
- పోటీ వ్యాపారంలో కస్టమర్లను లాస్ చేస్తున్న సంస్థలు
- డెలివరీ చేసే పాయింట్లపై రైడ్స్కు జీహెచ్ఎంసీ ప్లాన్
- కమిషనర్ పర్మిషన్ కోసం వెయిటింగ్
చందానగర్లో ఓ వ్యక్తి ఆన్లైన్లో ప్రముఖ కంపెనీకి చెందిన జ్యూస్ బాటిళ్లు ఆర్డర్ చేశాడు. అయితే, నిర్వాహకులు ఎక్స్పైరీ అయిన బాటిల్స్ పంపించారు. బాటిల్స్పై మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్లను చూడగా, ఈ విషయం బయటపడింది. లేకపోతే, వాటిని తాగి అనారోగ్యం పాలయ్యే వారే. పోటీ సంస్థల కన్నా తొందరగా డెలివరీ చేయాలన్నా అత్యుత్సాహం ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది.
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆన్ లైన్ గ్రోసరీ డెలివరీ సంస్థల తొందరపాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడు చేసేలా ఉంది. 15 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ఒకరు,10 నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామని మరొకరు.. పోటీ వాతావరణంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తొందరపాటులో వస్తువుల నాణ్యతను, ఎక్స్పైరీ డేట్లను పట్టించుకోకుండా పంపిస్తుండడంతో చాలామంది అలాగే వాడేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు కొన్ని బల్దియా దృష్టికి రావడంతో ఆన్లైన్ గ్రోసరీ, ఫుడ్డెలివరీ చేసే సంస్థలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఫుడ్సేఫ్టీ విభాగం అధికారులు డెలివరీ సంస్థలకు సంబంధించిన పాయింట్లపై ఆకస్మిక దాడులు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
కరోనా నుంచి పెరిగిన డిమాండ్
ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ యాప్స్కు సిటీలో విపరీతమైన డిమాండ్ఉంది. ఇంట్లోనే కూర్చొని పాల నుంచి మొదలుపెట్టి నిత్యావసర సరుకుల వరకు ఏవైనా తెప్పించుకునే వెసులుబాటు ఉండడంతో సిటీ జనం ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఆఫర్లు కూడా ఇస్తుండడంతో అట్రాక్ట్ అవుతున్నారు. షాప్, మాల్కు వెళ్లి, రావడం టైమ్వేస్ట్ వ్యవహారమని జనాలంతా ఆన్లైన్ గ్రోసరీ యాప్స్లోనే ఆర్డర్స్ ఇస్తున్నారు. ఈ కల్చర్కరోనా నుంచి మరింత పెరిగింది. డిమాండ్ పెరుగుతుండడంతో డెలివరీ సంస్థల సంఖ్య కూడా పెరుగుతోంది.
జెప్టో, అమెజాన్ ఫ్రెష్, ఇన్స్టా మార్ట్, బ్లింక్ ఇట్, బిగ్ బాస్కెట్ లాంటి సంస్థలు రోజూ వేల డెలివరీలు చేస్తున్నాయి. అయితే, కొన్ని సంస్థలు డెలివరీ చేసే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రోజువారి కిరాణ సామగ్రితో పాటు నిత్యావసర వస్తువుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పీడ్డెలివరీ అంటూ ఐటమ్స్ క్వాలిటీ, క్వాంటిటీ, ఎక్స్పైరీ డేట్లను చూడడం లేదు. కొన్నిసార్లు ఫేక్ ప్రొడక్ట్స్కూడా వస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో కస్టమర్లు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు.
కమిషనర్ అనుమతి కోసం వెయిటింగ్
ఇప్పటివరకు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మార్ట్లపై బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే, ఇప్పుడు చాలామంది కస్టమర్ల నుంచి ఆన్లైన్ గ్రోసరీ, ఫుడ్ డెలివరీ ప్రొడక్ట్స్పై కంప్లయింట్స్ వస్తుండడంతో సదరు సంస్థలపై దృష్టిపెట్టారు. పలువురి నుంచి వివరాలు సేకరించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు డెలివరీ చేసే స్టాక్ పాయింట్లపై దాడులు చేయాలని భావిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎక్కడైనా కాలం చెల్లిన స్టాక్, నాసిరకం వస్తువులు దొరికితే నోటీసులిచ్చి అవసరమైతే సీజ్ చేసేందుకైనా వెనుకాడేది లేదంటున్నారు. కమిషనర్ కర్ణన్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.