- మొత్తం 9,168 పోస్టులు భర్తీ చేసే అవకాశం
- ఖాళీల వివరాలపై డిపార్ట్మెంట్లతో ఆర్థిక శాఖ కసరత్తు
- వీటిపై స్పష్టత వచ్చాక నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ కసరత్తు వేగవంతం చేసింది. ఇంటర్మీడియెట్ అర్హత, జిల్లా స్థాయి పోస్టులు కావడం, ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో చాలా మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో నోటిఫికేషన్ను త్వరగా ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి అందిన ఖాళీ పోస్టుల వివరాలకు ఆర్థిక శాఖ అనుమతి లభించింది. మరికొన్ని శాఖల్లో ఖాళీల వివరాలపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ఆయా శాఖల నుంచి సమాచారం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీకు అనుమతి ఇవ్వనున్నారు. మొత్తం ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలని భావిస్తుండటంతో, ఈ నెలఖారు కల్లా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రూప్ 4లో మొత్తం 9,168 ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
నోటిఫికేషన్ల మధ్య 3, 4 నెలల గ్యాప్
ఇప్పటికే గ్రూప్1, ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇందులో గ్రూప్ 1, పోలీసు ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యే వాళ్లు కూడా కచ్చితంగా గ్రూప్ 2, 3కు పోటీ ఇస్తారు. దీంతో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ల మధ్య గ్యాప్ ఇవ్వనున్నారు. ఈ రెండు నోటిఫికేషన్లకు కనీసం మూడు, నాలుగు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే గ్రూప్ 4 పోస్టుల భర్తీపై దృష్టి పెట్టింది. జిల్లా స్థాయి పోస్టులు కావడంతో ఒక్కో జిల్లాకు సగటున 250 పోస్టులు వచ్చే చాన్స్ ఉంది. ఈ స్థాయిలో ఉమ్మడి ఏపీలోనూ ఎప్పుడూ పోస్టులు రాలేదు. ఈ ఒక్క నోటిఫికేషన్తో నిరుద్యోగులు ప్రిపరేషన్లో బిజీ అయిపోతారని, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలా వరకు పోతుందని భావిస్తున్నారు.
10 లక్షల మంది దరఖాస్తుకు చాన్స్
అన్ని డిపార్ట్మెంట్ల నుంచి గ్రూప్ 4 ఉద్యోగాలకు ఇండెంట్ ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత గ్రూప్ 4 ఉద్యోగుల అవసరం మరింత పెరిగింది. ఇప్పటి వరకు 5,200 పోస్టులకు సంబంధించి డిపార్ట్మెంట్ల నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఇంకో 4 వేల పోస్టుల వివరాలపై స్పష్టత రాగానే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుంది. ఒకవేళ ఉద్యోగం వస్తే సొంత జిల్లాలోనే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, స్టెనో హోదాలో పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. దీంతో ఈ పోస్టులకు కనీసం 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.