పేపర్ల లీకేజీ వ్యవహారంపై స్పందించని సీఎం, మంత్రులు

పేపర్ల లీకేజీ వ్యవహారంపై  స్పందించని సీఎం, మంత్రులు
  • స్పందించని సీఎం, మంత్రులు.. ఆందోళనలో లక్షల మంది నిరుద్యోగులు
  • రిక్రూట్మెంట్ మీటింగ్​లోనూ చర్చించని సీఎస్​
  • ఊగిసలాటలో టీఎస్​పీఎస్సీ
  • అన్ని పరీక్షల పేపర్లూ లీకయ్యాయని నిరుద్యోగుల్లో అనుమానాలు
  • రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
  • టీఎస్​పీఎస్సీ ఆఫీసు ఏరియాలో 144 సెక్షన్

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంపై నిరుద్యోగులు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నా.. రాష్ట్ర సర్కారులో మాత్రం ఉలుకూ లేదు పలుకూ లేదు. పరీక్షల నిర్వహణపై లక్షల మంది ఆందోళనలో ఉంటే.. కనీసం స్పందిస్తలేదు. కమిషన్​ కూడా నాన్చుడు ధోరణిలో ఉన్నది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రశ్నపత్రం  లీకైందని పోలీసులు అధికారికంగా 
ప్రకటించినా.. పరీక్షను రద్దు చేయాల్నా వద్దా అనేదానిపై మూడు నాలుగు రోజులు ఊగిసలాడింది. చివరికి అభ్యర్థుల నిరసనలకు దిగొచ్చి.. ఏఈ ఎగ్జామ్​ను రద్దు చేస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించింది. మరోపక్క ఏఈతోపాటు గ్రూప్​1 ప్రిలిమ్స్​, ఇతర ఎగ్జామ్స్​ను కూడా క్యాన్సిల్​ చేయాలని, పేపర్లన్నీ లీకయ్యాయని విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. నిరుద్యోగుల పోరాటానికి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. 

గ్రూప్ 1 ప్రిలిమ్స్​ ఎగ్జామ్ రద్దు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ప్రకటించారు. పేపర్​ లీకేజీ వ్యవహారంపై 9 మందితో విచారణ కమిటీని బీజేపీ వేసింది. ఇంత జరుగుతున్నా.. సీఎం కేసీఆర్​ గానీ, మంత్రులు గానీ, చివరికి సీఎస్ శాంతికుమారి గానీ స్పందించడంలేదు. 

సైలెంట్​ ఎందుకు?

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్​(టీఎస్​పీఎస్సీ)లో 30 లక్షలకు పైగా మంది వన్ టైమ్ రిజిస్ర్టేషన్(ఓటీఆర్​) చేసుకున్నారు. నిరుడు 17వేలకు పైగా పోస్టుల భర్తీకి 26 నోటిఫికేషన్లు ఇచ్చారు. దీంట్లో  గ్రూప్ 1 ప్రిలిమ్స్​, ఏఈ సహా మొత్తం 6 రిక్రూట్మెంట్ టెస్టులు జరిగాయి. గత ఏడు రోజులుగా టౌన్ ప్లానింగ్ రిక్రూట్మెంట్ పేపర్​తో పాటు, అసిస్టెంట్ ఇంజినీర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ల లీక్​ వ్యవహారం కలకలం సృష్టిస్తున్నది. పోలీసులు తమ విచారణలో ఆ రెండు పేపర్లూ లీక్ అయినట్టు, దీనికి టీఎస్​పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్​ కుమార్​, నెట్ వర్క్ అడ్మిన్ రాజశేఖర్​ ద్వారానే  తతంగం జరిగిందని తేల్చారు. దీంతో ప్రవీణ్​ను కమిషన్​ అధికారులు సస్పెండ్ చేయగా, రాజశేఖర్​ను విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం లీకేజీతో సంబంధం ఉన్న 9 మంది జైల్లో ఉన్నారు. టౌన్​ ప్లానింగ్​, అసిస్టెంట్​ ఇంజనీర్​ ఎగ్జామ్​ పేపర్లతోపాటు గ్రూప్1 ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ పేపర్​ కూడా లీకైందని నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  నిందితుడు ప్రవీణ్​కు గ్రూప్​ 1 ప్రిలిమ్స్​లో 103 మార్కులు రావడమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరగడంతోనే ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ నోరు విప్పడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మంగళవారం టీఎస్​పీఎస్సీ మినహా మిగిలిన అన్ని రిక్రూట్మెంట్ బోర్డుల ప్రతినిధులతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సమావేశయ్యారు. కమిషన్ మీటింగ్ నేపథ్యంలో టీఎస్​పీఎస్సీ అధికారులు సీఎస్​ వద్ద సమావేశానికి హాజరుకాలేదా.. లేక వారిని మీటింగ్​కు పిలువలేదా? అనేదానిపై స్పష్టత లేదు. సమావేశంలో టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఒక్క మాట కూడా సీఎస్​ మాట్లాడలేదు.

కమిషన్ ఊగిసలాట

పేపర్​ లీకేజీలపై శుక్రవారం పోలీసుల నుంచి ఫిర్యాదు అందితే.. మంగళవారం వరకూ టీఎస్​పీఎస్సీ స్పందించలేదు. విద్యార్థి, యువజన సంఘాల ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతుండటంతో కమిషన్​  చైర్మన్ జనార్దన్ రెడ్డి తన కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే, పోలీసుల నుంచి అధికారికంగా రిపోర్టు వచ్చిన తర్వాతే, పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోపక్క ప్రవీణ్ కుమార్ సెల్​ ఫోన్ పై ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక, అన్నింటిపైనా క్లారిటీ వస్తుందని కమిషన్ అధికారులు చెప్తున్నారు. 

ఏఈ ఎగ్జామ్ రద్దు

ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ఎగ్జామ్​ను రద్దు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. 837 పోస్టుల ఈ పరీక్షను 55 వేల మంది రాశారు. పేపర్ లీక్ కావడంతో.. రద్దు చేస్తూ  కమిషన్​ నిర్ణయం తీసుకుంది.