
- ఆదివాసీలు, గిరిజనుల ఆందోళనలతో జీవో 49ని నిలిపివేసిన రాష్ట్ర సర్కార్
- జీవో నిలిపివేయాలని సీఎంను కోరిన మంత్రులు సురేఖ, జూపల్లి, సీతక్క
- జీవోని అబయెన్స్లో పెడుతూ అటవీశాఖ ఉత్తర్వులు
- సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆదివాసీ సంఘాల నేతలు
హైదరాబాద్, వెలుగు: పులులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ‘కుమ్రం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్' ను ప్రకటిస్తూ సర్కారు జారీచేసిన జీవో 49ని నిలిపివేస్తూ (అబయెన్స్) సోమవారం అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం, ఉమ్మడి ఆదిలాబాద్లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ను అటవీ ప్రాంతం గుండా కలిపే ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటిస్తూ ఈ ఏడాది మే 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ని జారీ చేసింది. 9 ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని 1.50 లక్షల హెక్టార్ల అటవీ భూములతో కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేసింది.
ఈ జీవోపై ఆదివాసీలు, గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 336 గ్రామాలపై ఇది ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చేపట్టారు. ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిని రద్దు చేయాలని ఆదివాసీలు, గిరిజనులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. జీవోపై ఆదివాసీ, గిరిజనుల్లో అనుమానాలు, అభ్యంతరాల నేపథ్యంలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆదివాసీ సంఘాల నేతలతో సమావేశమై చర్చించారు.
ఈ విషయంపై మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదించారు. ఆయన ఆదేశాల మేరకు జీవోను నిలిపిచేస్తూ అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆదివాసీ, గిరిజనలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో సంబురాలు చేసుకుంటున్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఉన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే బీజం..
2016లో బీఆర్ఎస్ హయాంలో తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను కలిపే కారిడార్ ప్రాంతాన్ని కుమ్రం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వన్య ప్రాణి బోర్డు మొదటి సమావేశంలో ప్రతిపాదిత ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించాలనే ప్రతిపాదనపై చర్చించింది. 2017 ఫిబ్రవరి 27న రాష్ట్ర వన్యప్రాణి బోర్డు రెండో సమావేశంలో నోటిఫికేషన్ కోసం చర్యలు చేపట్టింది. 2018 జూన్ 26న చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ప్రతిపాదిత ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని ప్రతిపాదనలు పంపింది.
2019 జులై 11లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ కారిడార్ కు అనుబంధంగా ప్రతిపాదిత ప్రాంతాన్ని ఉపగ్రహ కేంద్రంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఆ ప్రాంతాన్ని అత్యవసరంగా కన్జర్వేషన్ జోన్గా ప్రకటించాలని, జాతీయ పులుల సంరక్షణ సంస్థ తెలంగాణ అటవీశాఖను ఆదేశించింది. ఈ ప్రక్రియను కొనసాగిస్తూ అప్పటి ఎంపీ నగేష్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితోపాటు అన్ని పార్టీల ప్రజా ప్రతినిధుల మద్దతుతో 2024 జులై 10న ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా కుమ్రం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేస్తూ జీవో 49 ని జారీ చేసింది.
అడవి బిడ్డలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సురేఖ
అడవి బిడ్డలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జీవోపై స్థానిక ప్రజలతో మాట్లాడి సీఎంకు నివేదిక ఇచ్చామని తెలిపారు. జీవో నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎంకు మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు.
అన్ని కోణాల్లో చర్చించి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం: జూపల్లి కృష్ణారావు
ఆదివాసీలకు ప్రజా ప్రభుత్వం అన్యాయం చేయదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వం ఆదివాసీలకు అండగా ఉంటుందన్నారు. వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అన్ని కోణాల్లో చర్చించి జీవో నిలుపుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
సీఎంకు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
కేంద్రం ఒత్తిడితో జీవో 49ని తీసుకురావడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నిలిపివేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపీ సోయం బాబురావు మాట్లాడుతూ.. జీవో 49తో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆదివాసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
‘కన్జర్వేషన్ రిజర్వ్’ ఏర్పాటుకు బీజం వేసిందే బీఆర్ఎస్: మంత్రి సీతక్క
జీవో 49ని నిలిపివేయాలని ప్రకటించిన సీఎంకు సీతక్క కృజ్ఞతలు తెలిపారు. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకెళ్తామని సీతక్క పేర్కొన్నారు. కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటుకు అన్ని పార్టీలు సంతకం చేశాయన్నారు. కుమ్రం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్కు బీజం వేసిందే బీఆర్ఎస్ అని ఆమె పేర్కొన్నారు.