
- కమిషన్కు అఫిడవిట్లు సమర్పించిన ఇరిగేషన్ ఆఫీసర్లు
- వచ్చే నెల 5న రాష్ట్రానికి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్
- ప్రజల నుంచి వచ్చిన అఫిడవిట్లపై బహిరంగ విచారణ
- అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే చాన్స్
- గత ప్రభుత్వ పెద్దలనూ పిలిచే అవకాశం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గడువును రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు శనివారం ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ గడువు ఆదివారంతో ముగియనుండగా ఆగస్టు 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఈ ఏడాది మార్చి 14న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఫాం చేసింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కమిషన్కు ఆఫీస్ స్పేస్ను కూడా కేటాయించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ జులై 5న మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈసారి అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలోని కీలక నేతలను విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.
మూడు దఫాలు రాష్ట్రానికి
వాస్తవానికి కమిషన్ను ఏర్పాటు చేసేటప్పుడు వంద రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 30 నాటికి కాళేశ్వరం అక్రమాలు, అవకతవకలపై రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కమిషన్ను కోరింది. అయితే, జస్టిస్ ఘోష్ ఇప్పటికే మూడు దఫాలుగా రాష్ట్రానికి వచ్చి అధికారులతో సమావేశమై అన్ని వివరాలను తెలుసుకున్నారు. తొలిసారిగా రాష్ట్రానికి ఏప్రిల్ 24న ఆయన వచ్చారు. అప్పుడు మూడు రోజుల పాటు ఉండి అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మే 6న మరోసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఘోష్.. కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించారు. దాంతోపాటు ఆఫీసర్లతో సమావేశమై విచారణ జరిపారు. రెండో దఫా పర్యటనలో ఆరు రోజుల పాటు ఇక్కడే ఉన్నారు.
ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సంబంధం లేని నిపుణులతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశాక మూడోసారి ఈ నెల 6న రాష్ట్రానికి వచ్చిన ఆయన.. బ్యారేజీలను టెక్నికల్కమిటీలతో కలిసి పరిశీలించారు. బ్యారేజీలకు సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. ఇదే దఫాలో మాజీ ఈఎన్సీ మురళీధర్తో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని అన్ని విభాగాల అధికారులతోనూ సమావేశమయ్యారు. వారు చెప్పిన వివరాలను జూన్ 27లోగా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని ఆదేశించారు.
జనం నుంచి కూడా అఫిడవిట్లు
అధికారుల నుంచే కాకుండా సామాన్యుల నుంచి కూడా వివరాలను తెలుసుకునే పనిలో జస్టిస్ పీసీ ఘోష్ నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే పబ్లిక్ నుంచి ఆధారాలను తీసుకునేందుకు బహిరంగ ప్రకటనను జారీ చేశారు. బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన సజెషన్స్ బాక్స్లో అఫిడవిట్లను సమర్పించాల్సిందిగా బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు. మే 31 వరకు గడువు విధించగా 54 అఫిడవిట్లు వచ్చాయి. అయితే, అందులో సింహభాగం పరిహారానికి సంబంధించినవే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇటు అధికారుల నుంచి కూడా అఫిడవిట్లు అందాయి. ఈ నేపథ్యంలోనే జులై 5 నుంచి మరోసారి జస్టిస్ ఘోష్ విచారణ జరపనున్నారు. ఈ సారి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలపై బహిరంగ విచారణ జరపడంతో పాటు.. అధికారుల నుంచి వచ్చిన అఫిడవిట్ల ఆధారంగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆనాటి రాజకీయ పెద్దలను కూడా విచారణకు పిలుస్తారని సమాచారం.
వంద రోజుల్లో పూర్తి కానందునే..
కాళేశ్వరంపై వంద రోజుల్లోనే జ్యుడీషియల్ కమిషన్ విచారణ పూర్తి చేస్తుందని రాష్ట్ర సర్కారు గతంలో ప్రకటించింది. అయితే, జస్టిస్ ఘోష్ పక్కా ఆధారాలను సేకరిస్తున్నారు. వాటి ఆధారంగానే విచారణ జరపాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తొలి దశలో మాజీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ప్రజల నుంచి అఫిడవిట్లను తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగింది కేవలం ఆధారాల సేకరణేనని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఈసారి జరిగే విచారణే సీరియస్గా ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం జూన్ 30 వరకు రిపోర్ట్ ఇవ్వాలని కోరినా.. అది సాధ్యపడదని జస్టిస్ ఘోష్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.