
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అమలు చేయబోతున్న నూతన క్రీడా విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామన్నారు.
సోమవారం ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఒలింపిక్ డే రన్–2025 ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో తీసుకొచ్చిన మార్పులను క్రీడా సమాజం హర్షిస్తోంది. క్రీడాకారులకు పెంచిన నగదు పురస్కారాలు, క్రీడా రిజర్వేషన్ల పెంపుతో పాటు సమగ్రమైన క్రీడా విధానాన్ని త్వరలోనే అమలు చేస్తాం’ అని వెల్లడించారు.
ఈ వేడుకల్లో భాగంగా ఉత్తరాఖండ్లో జరిగిన 38వ జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులను ప్రభుత్వం సత్కరించింది. వారికి మొత్తం రూ. 84 లక్షల నగదు పురస్కారాన్ని మంత్రి శ్రీహరి చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్రంలో ఒలింపిక్ స్ఫూర్తిని విస్తృతం చేసేందుకు ఆరు రోజుల పాటు 33 జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహించారు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని 14 కేంద్రాల నుంచి ప్రారంభమైన ఒలింపిక్ జ్యోతులు ఎల్బీ స్టేడియానికి చేరుకున్నాయి.
తెలంగాణ క్రీడా ఆణిముత్యాల పేర్లతో ఈ జ్యోతులను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, అర్జున అవార్డు గ్రహీతలు, ఒలింపియన్లు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.