ఓఎంఆర్ షీట్ సిస్టమ్ లో గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. అక్టోబర్ 16 న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలకు పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఓఎంఆర్ షీట్ లో హాల్ టికెట్ నంబర్, బుక్ లెట్ నంబర్ ఖచ్చితంగా అభ్యర్థులు ఎంట్రీ చేయాలని సూచించింది. బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే పరీక్షకు వాడాలని తెలిపింది. TSPSC వెబ్ సైట్ లో OMR మోడల్ షీట్ పేపర్ ను అందుబాటులో ఉంచామన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు ఇవాళ్టి నుంచి https://www.tspsc.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూలై నెలలోనే నిర్వహించాలి. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఉండటంతో దీనిని అక్టోబర్ 16కు వాయిదా వేశారు.
ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ
గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీ పడుతున్నారు. జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అవకాశముంది. దివ్యాంగుల కేటగిరీలో గల 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. 51,553 (15.33శాతం ) మంది ప్రభుత్వ ఉద్యోగులూ దరఖాస్తు చేసుకున్నారు.