- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం, వెలుగు : ‘ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి, ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్లు, ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు.
విద్యార్థులు, యువతే రాష్ట్ర భవిష్యత్ అని, వారు ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోనే మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందన్నారు. మధిర నియోజకవర్గంలో మూడు మోడల్ స్కూళ్ల పాటు జిల్లాలో యంగ్ ఇండియా స్కూళ్ల పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులో తీసుకురావాలని ఆదేశించారు.
ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని చెప్పారు. మూడు నెలలకోసారి బిల్లులు సబ్మిట్ చేయని సెక్రటరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన రైతుల కోసం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని, గ్రీన్ ఎనర్జీని పెద్దఎత్తున వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
రివ్యూలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐటీడీఏ పీఓ రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు.
గురుకుల కాలేజీ తనిఖీ
ఖమ్మంలో రివ్యూ అనంతరం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కాలేజీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధిర వెళ్లే క్రమంలో నేరుగా గురుకుల వసతి గృహంలోకి వెళ్లి పరిశీలించారు. తర్వాత విద్యార్థులు, ప్రిన్సిపల్తో మాట్లాడారు. డైనింగ్ రూమ్లో వంట పాత్రలను తనిఖీ చేసిన అనంతరం, స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. దోమల నివారణ కోసం స్టూడెంట్లు తయారు చేసే అగరవత్తులను పరిశీలించి, బ్రాండింగ్ చేసి మార్కెట్లో అమ్మేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు.
