
- హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
- పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండదని హామీ
- ఇందుకు తగ్గట్టుగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు
- తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉండబోదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నివేదించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) గతంలో ఇచ్చిన రిపోర్టుల ఆధారంగానే సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఉంటుందని తెలియజేసింది. కమిషన్ రిపోర్టు ఆధారంగా చేసుకొని పిటిషనర్లు కేసీఆర్, హరీశ్రావుపై ప్రతికూల చర్యలు తీసుకోబోమని కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వ హామీ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పిటిషనర్లు కేసీఆర్, హరీశ్పై చర్యలు తీసుకోవద్దని, కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకొని సీబీఐ దర్యాప్తు చేయొద్దని, ఎన్డీఎస్ఏ రిపోర్టుల ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ సాగాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 7వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి. ఎం. మొహియుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశాలను వెలువరించింది.
ఘోష్ కమిషన్ రిపోర్ట్పై వాదోపవాదాలు
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై కోర్టులో ఇరువైపులా వాదోపవాదాలు జరిగాయి. కేసీఆర్, హరీశ్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్స్ ఆర్యమ సుందరం, దామ శేషాద్రి నాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి, సీనియర్ అడ్వకేట్ ఎస్.నిరంజన్రెడ్డి వాదించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేయాలంటూ కేసీఆర్, హరీశ్రావు వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు (ఐఏ) వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో నిర్లక్ష్యం, అవకతవకలు, లోపాలపై ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఏం చేయబోయేదీ తెలియజేయాలని రాష్ట్రాన్ని హైకోర్టు సోమవారం కోరింది. మంగళవారం విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కమిషన్ రిపోర్ట్ మేరకు పిటిషనర్లపై ఏవిధమైన చర్యలు ఉండబోవన్నారు. అలాగే, రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకొని సీబీఐ దర్యాప్తు జరగదని కూడా చెప్పారు. నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి లోతుగా చర్చించిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. కానీ, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. పిటిషనర్లు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయనే భయంతో వేసిన ఐఏలను డిస్మిస్ చేయాలని కోరారు. సీబీఐ కేవలం దర్యాప్తు మాత్రమే చేసి, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుందని వివరించారు.
హామీని రికార్డుల్లో నమోదు చేయాలి: పిటిషనర్ల తరఫు లాయర్లు
కేసీఆర్, హరీశ్రావు తరఫు అడ్వొకేట్లు వాదిస్తూ, నిన్నటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఎవరు తప్పు చేశారో ఉందంటూ ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా సీఎం గట్టిగా చెప్పారని తెలిపారు. ఇప్పుడేమో కమిషన్ రిపోర్టుతో పనిలేదని, దీనిని ఆధారంగా చేసుకొని సీబీఐ దర్యాప్తు ఉండదని ఏజీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగానే కమిషన్ రిపోర్ట్తో పనిలేనప్పుడు అందులోని విషయాలను సీబీఐ దర్యాప్తు కావాలని కోరుతూ జారీ చేసిన నోటిఫికేషన్లో ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. సీబీఐ దర్యాప్తునకు కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రామాణికంగా తీసుకోబోమని, ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చర్యలు ఉండబోవన్న ప్రభుత్వ వాదనలకు తగ్గట్టుగా ఆర్డర్ ఇవ్వాలని కోరారు. కోర్టు ఆర్డర్ కూడా వెంటనే ఇవ్వాలని, లేకుంటే సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తే పిటిషనర్లకు మరో సమస్య వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజీ జోక్యం చేసుకొని వాస్తవాలను సీబీఐ దర్యాప్తునకు పరిగణనలోకి తీసుకోవచ్చునని చెప్పగా.. పిటిషనర్ల తరఫు లాయర్లు అభ్యంతరం చెప్పారు.
కమిషన్ రిపోర్ట్ను ఏం చేశారు: హైకోర్టు
కమిషన్ రిపోర్టును ఏం చేశారని, అసెంబ్లీలో పెట్టాక చర్యలకు ఉపక్రమించారా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీలో వివరంగా చర్చ జరిగిందని, చర్యలేమీ తీసుకోలేదని ఏజీ తెలిపారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున పిటిషన్లపై విచారణ అవసరం లేదని, వాటిని కొట్టేయాలని అన్నారు. సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని, గవర్నమెంట్కు రిపోర్టు మాత్రమే ఇస్తుందని, ఈలోగా కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉండబోదని చెప్పారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, గవర్నమెంట్ వద్ద ఉన్న వివరాల ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉంటుందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ 3, 5 పిల్లర్లు బీటలు వారాయని చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పి దాని కాపీలను కోర్టుకు అందజేశారు. సీబీఐ దర్యాప్తునకు జారీ చేసిన ఆదేశాల్లో వ్యక్తిగతంగా ఎవరి పేర్లు లేవని తెలిపారు. ఈ దశలో పిటిషనర్ల అడ్వకేట్లు జోక్యం చేసుకొని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు వేస్తామని చెప్పారు. కమిషన్ రిపోర్ట్పై అసెంబ్లీలో చర్చ మాత్రమే జరిగిందని, సీబీఐకి ఇవ్వాలనే తీర్మానం చేయలేదని వెల్లడించారు. ప్రభుత్వం తెలివిగా కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోమని చెబుతూనే.. అందులోని కీలక విషయాలను ప్రస్తావిస్తూ సీబీఐ దర్యాప్తునకు నోటిఫికేషన్ జారీ చేసిందని లాయర్ దామా శేషాద్రి నాయుడు వాదించారు. దీంతో ఏజీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆయనపై లాయర్ శేషాద్రి నాయుడు సీరియస్ అయ్యారు. కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే చేసుకోవాలని, లేకుంటే తప్పుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. తన వాదనలను ఏజీ అడ్డుకోవడం సబబు కాదన్నారు. వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ, కమిషన్ రిపోర్టు ఆధారంగా పిటిషనర్లపై చర్యలు ఉండవని ప్రభుత్వ హామీ నేపథ్యంలో ఆందోళన అవసరం లేదని చెప్పింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే సీబీఐ దర్యాప్తు ఉంటుందని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. ఒకవేళ ఏదైనా జరిగితే.. కోర్టులో ఈ వ్యవహారం విచారణలో ఉంటుంది కాబట్టి భయాందోళలు అవసరం లేదని స్పష్టం చేసింది. పిటిషన్లు, మధ్యంతర పిటిషన్లపై ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.