
తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావులకు స్వల్ప ఊరట లభించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాలేశ్వరం కమిషన్ నివేదికపై హరీష్ రావు, కేసీఆర్, దాఖలు చేసిన పిటిషన్ ను సెప్టెంబర్ 2న హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా.. కేసీఆర్, హరీశ్ రావు తరపున న్యాయవాదులు సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.
ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సుదర్శన్ రెడ్డి ..అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పై చర్చించామని చెప్పారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు . కేవలం నిర్ణయం మాత్రమే తీసుకుందని.. ఇంకా ఎలాంటి చర్యలు జరగలేదని చెప్పారు. సీబీఐ దర్యాప్తుకు కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంభందం లేదని తెలిపారు. సీబీఐ దర్యాప్తుతో నిజాలు బయటకు వస్తాయని..సీబీఐ దర్యాప్తు ఆధారంగానే చర్యలు ఉంటాయని కోర్టుకు తెలిపారు ఏజీ. అనంతరం కోర్టు.. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7 కు వాయిదా వేసింది.