
- దుబాయ్లో వరల్డ్ పోలీస్ సమిట్-2025
- వివిధ కేటగిరీల్లో పోటీపడ్డ 138 దేశాల పోలీసులు
- ‘ఎక్స్లెన్స్ ఇన్ యాంటీ- నార్కోటిక్స్’ అవార్డు అందుకున్న సీవీ ఆనంద్
- ఇటీవల -ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ర్యాంకింగ్స్లోనూ నంబర్ వన్గా రాష్ట్ర పోలీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీసులకు మరో అరుదైన గౌరవం దక్కింది. మాదకద్రవ్యాల నివారణకు చేస్తున్న కృషికిగాను ప్రపంచంలో మొదటి స్థానం లభించింది. ఈ మేరకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్( హెచ్ ఎన్ఈడబ్ల్యూ) చీఫ్ సీవీ ఆనంద్ ‘ఎక్సలెన్స్ ఇన్ యాంటీ- నార్కోటిక్స్’ అవార్టు అందుకున్నారు. దుబాయ్ ప్రభుత్వం ఈ నెల13 నుంచి మే 16 వరకు నిర్వహించిన ‘వరల్డ్ పోలీస్ సమిట్’ (డబ్ల్యూపీఎస్) 2025లో భాగంగా శుక్రవారం అవార్డులు ప్రదానం చేసింది. ఈ సమిట్లో 138 దేశాల నుంచి ఆయా పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో నిర్వహించిన పోటీలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకున్నది.
మూడేండ్ల కృషికి గుర్తింపు
హైదరాబాద్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడానికి తీసుకున్న పటిష్టమైన చర్యలు, విద్యార్థులు, సాధారణ ప్రజల్లో అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలను వరల్డ్ పోలీస్ సమిట్ పరిగణనలోకి తీసుకుంది. హెదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు గడిచిన మూడేండ్లలో సాధించిన ఫలితాలను పరిశీలించింది. ఈ క్రమంలోనే యాంటీ నార్కోటిక్స్ కేటగిరీలో హెచ్న్యూకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. అవార్డుల ప్రదానోత్సవానికి ముందు జరిగిన ప్యానెల్ డిస్కషన్లో సీవీ ఆనంద్ కీలక ప్రసంగం చేశారు. సింథటిక్ డ్రగ్స్, గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల సమస్యల గురించి వెల్లడించారు. కొవిడ్ తర్వాత వివిధ మార్గాల ద్వారా ఇండియాలోకి మాదకద్రవ్యాలు వచ్చిన విధానాన్ని వివరించారు. డ్రగ్ పెడ్లర్లను పట్టుకోవడం, డ్రగ్స్ వ్యతిరేక కమిటీల ఏర్పాటు, ప్రజలు విద్యా సంస్థల్లో అవగాహనసహా బాధితులకు అవసరమైన రిహాబిలిటేషన్ ఏర్పాట్ల గురించి సీవీ ఆనంద్ మాట్లాడారు.
నిరుడు 2,169 కేసులు.. 5,205 మంది అరెస్ట్
నిరుడు టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీసులు కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్లలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 2,169 కేసులు నమోదు చేశారు. ఇందులో 312 మంది మహిళలు సహా మొత్తం 5,205 మందిని అరెస్ట్ చేశారు. రూ.148.09 కోట్ల విలువ చేసే వివిధ రకాల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 2023 లో నమోదైన కేసుల్లో మొత్తం 3,688 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా మత్తు మాఫియా రాష్ట్రంలో ఏటా దాదాపు రూ.250 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాల దందా చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా డ్రగ్స్, గంజాయి కట్టడి చేసేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేక కార్యచరణ రూపొందించాయి.
ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025లోనూ..
జాతీయస్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్ నిర్వహిస్తున్న కేటగిరీలోనూ రాష్ట్ర పోలీసులు ఇటీవల మొదటి స్థానంలో నిలిచారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025 ర్యాంకింగ్స్లో 10 పాయింట్లకుగాను 6.48 పాయింట్లతో టాప్ ప్లేస్ లో నిలిచారు. పోలీస్, న్యాయ వ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్ ఎయిడ్ సహా మొత్తం 32 అంశాలకు సంబంధించి10 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన తెలంగాణ, ఏపీ సహా18 పెద్ద రాష్ట్రాలు, 10 మిలియన్ల లోపు జనాభా గల సిక్కిం సహా 7 చిన్న రాష్ట్రాల్లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ సర్వే చేసింది. గత నెల 15న ర్యాంక్స్ ప్రకటించింది. ఇందులో రాష్ట్ర పోలీసులు అత్యపత్తమ పోలీసింగ్గా నిలిచారు. స్టేషన్లకు వచ్చే బాధితులకు మెరుగైన సేవలుసహా టెక్నాలజీని వినియోగించడంలో టాప్ వన్గా నిలిచారు.
పోలీసులందరికీ గర్వకారణం
ఈ విజయం దేశంలోని పోలీసులందరికీ గర్వకారణం. అంతర్జాతీయ పోలీస్ సమిట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత సమర్థవంతమైన పోలీస్ డిపార్ట్మెంట్లు పోటీపడ్డాయి. ఇందులో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్.. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ- నార్కోటిక్స్ అవార్డు గెలుచుకోవడం ఆనందంగా ఉంది. డ్రగ్స్, గంజాయిని నియంత్రించడంలో హెచ్న్యూ అనుసరించిన వినూత్న విధానాల వల్లనే ఈ గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
సీవీ ఆనంద్, డీజీ, సీపీ హైదరాబాద్