జీడిమెట్ల, వెలుగు: ఫోన్ ఇస్తామని ఆశ చూపి మైనర్ బాలిక(7)పై తండ్రీకొడుకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రాబస్తీకి వచ్చింది. కూతురుని (7) ఇంటి వద్ద ఉంచి దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వారి ఇంటి పక్కనే కర్నాటకకు చెందిన శివకుమార్(49), అతని కొడుకు శ్యామేల్(19) ఉండేవారు. దంపతులు రోజూలాగే గురువారం కూడా చిన్నారిని ఇంటి వద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. అది గమనించిన తండ్రీకొడుకులు.. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి ఫోన్ ఇస్తామని ఆశ చూపించారు. అనంతరం ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితులైన తండ్రి, కొడుకును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.