వెలుగు, నెట్వర్క్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలో ఆరుగురు స్టూడెంట్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఇంటర్బోర్డు రిజల్ట్ విడుదల చేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రానికి చెందిన వైశాలి (17) ఖమ్మంలో ఎంపీసీ ఫస్ట్ఇయర్ చదువుతున్నది. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురైన సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లా మంచిర్యాల మండలం దొరగారిపల్లికి చెందిన తేజస్వి(18) ఇంటర్ ఫస్టియర్చదువుతున్నది.
రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తన బెడ్రూంలోని ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచలాపూర్ కు చెందిన మైదం సాత్విక్(18) ఎంపీసీ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ కు చెందిన సాయితేజగౌడ్(17) సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
పరీక్షల్లో ఫెయిల్ అవడంతో కొల్లూర్ లోని చెరువు కట్ట వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకొడుకు చెందిన భార్గవి (17) వరంగల్ లో బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్లోని హైదర్ గూడకు చెందిన బాలిక(16) ఎంపీసీ ఫస్ట్ఇయర్ చదువుతున్నది. మ్యాథ్స్ లో ఫెయిల్ కావడంతో ఇంట్లో విండోకు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది.