
- తెలంగాణలో ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం ఇచ్చినోళ్లు 67%
- ఆలిండియాలో తెలంగాణకు 5వ స్థానం.. ఏపీకి 13వ ప్లేస్
- దేశంలో టాప్ రాజస్థాన్.. తర్వాత బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్
- ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ‘ఇండియా కరప్షన్ సర్వే-2019’
ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. కానీ ఆ హక్కును లంచంతో కొనుక్కోవాల్సి వస్తోంది. చేయి తడపనిదే ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగట్లేదు. ‘ఇండియా కరప్షన్ సర్వే-2019’ పేరుతో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ చేసిన సర్వేలో వెల్లడైన విషయమిది. దేశం మొత్తం 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబరు వరకు ఈ సంస్థ సర్వే చేసింది. 20 రాష్ట్రాల్లోని 248 జిల్లాల్లో లక్షా 90 వేల మంది నుంచి శాంపిల్ సేకరించారు. ప్రజల నుంచి తీసుకున్న ఆ అభిప్రాయాల ఆధారంగా సర్వే ఫలితాలను వెల్లడించింది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా. దేశ వ్యాప్తంగా 51 శాతం జనాలు తాము ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు చేయించుకోవడానికి లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఈ సర్వేలో చెప్పారు. అయితే గతేడాదితో పోలిస్తే అవినీతి ఐదు శాతం తగ్గింది. 2018లో జరిగిన సర్వేలో 56 శాతం లంచాలు ఇచ్చినట్లు చెప్పారు.
లంచం ఇవ్వలేదన్నది 11 శాతమే
దేశంలో అవినీతి విషయంలో రాజస్థాన్ టాప్లో నిలిచింది. ఆ రాష్ట్రంలో సర్వేలో పాల్గొన్నవారిలో 78 శాతం ప్రజలు లంచం ఇవ్వనిదే పని అయిన రోజు లేదని చెప్పారు. ఇక రాజస్థాన్ తర్వాత 75 శాతంతో బీహార్ రెండో స్థానంలో ఉంటే, 74 శాతంతో జార్ఖండ్, యూపీలు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. వాటి తర్వాత మన తెలంగాణనే ఉంది. దేశం మొత్తంగా చూస్తే 5వ ప్లేస్లో ఉన్న రాష్ట్రం దక్షిణ భారతంలో తొలి స్థానంలో ఉంది. దేశంలో చివరి ఐదు స్థానాల్లో ఒరిసా, పశ్చిమబెంగాల్, కేరళ, హర్యానా, గోవా ఉన్నాయి.
- తెలంగాణలో 67 శాతం ప్రజలకు లంచం ఇవ్వకుండా పనులు కావడం లేదు.
- సర్వేలో పాల్గొన్న వారిలో 56 శాతం మంది చాలా సార్లు లంచం ఇచ్చామని, 11 శాతం మంది ఒకటీ రెండు సార్లు మాత్రమే ఇచ్చామని చెప్పారు.
- కేవలం 11 శాతం జనాలు తాము ఏప్పుడూ లంచం ఇవ్వలేదన్నారు.
- అవినీతి జాతీయ సగటు గతేడాది కన్నా ఈ ఏడాది తగ్గితే తెలంగాణలో మాత్రం పెరిగింది. నిరుడు 43 శాతం ఉన్న లంచాలు ఇప్పడు 67 శాతానికి ఎగబాకాయి.
40 శాతం భూ సమస్యల పరిష్కారానికే
తెలంగాణలో లంచాలు ఇచ్చామని చెప్పిన వాళ్లలో 40 శాతం ఆస్తుల రిజిస్ట్రేషన్, భూమి సమస్యల పరిష్కారం కోసమేనని తెలిపిందీ సర్వే. ఇక 33 శాతం మునిసిపల్ ఆఫీసుల్లో పనుల కోసం లంచం ఇచ్చామని చెబితే, పోలీసులకు లంచం ఇచ్చామని చెప్పింది మాత్రం 7 శాతం జనమే. ఇక ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, టాక్స్ ఆఫీసుల్లో లంచాలు ఇచ్చినవాళ్లు 20 శాతం ఉన్నారు.
ఏపీ కొంచెం బెటర్
అవినీతి విషయంలో ఆంధ్రప్రదేశ్ కొంచెం బెటర్గా ఉందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా 13వ ఉంది. దక్షిణాదిలో ఏపీ, కేరళ మాత్రమే జాతీయ సగటు కన్నా తక్కువ అవినీతితో ఉన్నాయి. జాతీయ సగటు 51 శాతం కన్నా కొంచెం తక్కువగా ఏపీలో 50 శాతం జనాలు లంచాలు ఇచ్చినట్లు చెప్పారు. అయితే చాలా సార్లు లంచాలు ఇచ్చామని 30 శాతం, ఒకటీ రెండు సార్లు ఇచ్చామని 20 శాతం పార్టిసిపెంట్స్ తెలిపారు. తాము ప్రభుత్వ ఆఫీసులో పని చేయించుకోవడానికి అసలు లంచం ఇవ్వలేదని 30 శాతం మంది చెప్పడం విశేషం. అయితే లంచాలు ఇచ్చిన వారిలో 43 శాతం ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ సమస్యల పరిష్కారానికి, 21 శాతం మునిసిపల్ పనుల కోసం ఇచ్చారు. ఏపీలోనూ గత ఏడాది 38 శాతం ఉన్న అవినీతి ఈ ఏడాది 50 శాతానికి పెరిగింది.
టాప్ – 15 రాష్ట్రాలివే
రాష్ట్రం లంచం ఇచ్చినవారి శాతం
1 రాజస్థాన్ 78%
2 బీహార్ 75
3 జార్ఖండ్ 74
4 యూపీ 74
5 తెలంగాణ 67
6 కర్ణాటక 63
7 పంజాబ్ 63
8 తమిళనాడు 62
9 ఛత్తీస్గఢ్ 57
10 మధ్యప్రదేశ్ 55
11 మహారాష్ట్ర 55
12 ఉత్తరాఖండ్ 50
13 ఆంధ్రప్రదేశ్ 50
14 గుజరాత్ 48
15 ఢిల్లీ 46