
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1942, ఫిబ్రవరి నాటికి సింగపూర్లోని బ్రిటిష్ ప్రభుత్వం జపాన్కు లొంగిపోయింది. ఈ సమయంలో కొన్ని వేల మంది భారత యుద్ధ ఖైదీలు జపాన్కు పట్టుబడ్డారు. ఈ ఖైదీలను భారత ఆర్మీ అధికారి మోహన్సింగ్కు జపాన్ సైన్యాధిపతి ఫూజివారా అప్పగించారు. యుద్ధ ఖైదీలతో బ్రిటిష్కు వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసేలా మోహన్సింగ్ను జపనీయులు ఒప్పించారు. 1942 ఆగస్టులో మోహన్సింగ్ 40 వేల మంది యుద్ధ ఖైదీలతో ఇండియన్ నేషనల్ ఆర్మీని సింగపూర్లో ఏర్పాటు చేశారు. ఐఎన్ఏ రూపకర్త, స్థాపకుడిగా కెప్టెన్ మోహన్సింగ్ను పిలుస్తారు. ఈ సంస్థ మార్చ్ ‘కదమ్ కదమ్ బడాయే జా’. దీనిని రామ్సింగ్ ఠాకూర్ కంపోజ్ చేశాడు. ఆ తర్వాత ఐఎన్ఏ పాత్రపైన జపాన్ సైనికాధికారులకు, మోహన్సింగ్కు వచ్చిన వివాదాల వల్ల మోహన్సింగ్, నిరంజన్సింగ్ గిల్లు అరెస్టయ్యారు. ఇదే సమయంలో జపాన్లో ప్రవాస జీవితం గడుపుతున్న రాస్ బిహార్ బోస్ టోక్యోలో 1942లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ను స్థాపించాడు. బ్యాంకాక్లో జరిగిన సదస్సులో రాస్బిహారీ బోస్ చైర్మన్గా ఉన్న ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ కిందికి ఐఎన్ఏను తీసుకురావాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇది ఐఎన్ఏలో విలీనమైంది. జపాన్, రాస్ బిహార్ బోస్ ఆహ్వానం మేరకు సుభాష్ చంద్రబోస్ సింగపూర్ వెళ్లి రాస్బిహారీని కలిసి 1943లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, ఐఎన్ఏ బాధ్యతలు స్వీకరించాడు. సుభాష్ చంద్రబోస్ 1943 ఆగస్టు 25న ఐఎన్ఏ సుప్రీంకమాండర్గా బాధ్యతలు స్వీకరించాడు.
ఆజాద్ హింద్ ఫౌజ్
సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వ్యవస్థీకరించి ఆజాద్ హింద్ ఫౌజ్గా మార్చాడు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టడం. ఇండియన్ నేషన్ ఆర్మీ, ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ల కలయికగా ఆజాద్ హింద్ ఫౌజ్ ఉండేది. ఈ ఫౌజ్ భారతీయులను సైన్యంలో చేరాలని ఉత్తేజితులను చేయడానికి ఆజాద్ హింద్ రేడియోని ఉపయోగించింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందడం కోసం జపాన్ పూర్తిగా సహకరిస్తుందని ఆ దేశ ప్రధాని టోజో సుభాష్ చంద్రబోస్కు హామీ ఇచ్చాడు. 1944, జూలై 6న బోస్ ఈ రేడియో ద్వారా గాంధీని జాతిపిత అని సంబోధిస్తూ భారత తుది పోరాటానికి ఆశీస్సులను కోరారు. ఐఎన్ఏ ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్. ఈ నినాదాన్ని మౌలానా హస్రత్ మోహానీ రూపొందించాడు. ఐఎన్ఏ ప్రధాన కేంద్రాన్ని 1944, జనవరిలో బర్మాలోని రంగూన్కు మార్చారు.
ఐఎన్ఏలోని రెజిమెంట్స్
సుభాష్ చంద్రబోస్ 1943, నవంబర్ 6న అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించి అండమాన్ దీవులకు షహీద్ దీవులని, నికోబార్ దీవులకు స్వరాజ్ దీవులని పేరు పెట్టాడు. 1944 మార్చి 18న హింద్ ఫౌజ్ బర్మా సరిహద్దును దాటి భారత నేలపై అడుగు పెట్టింది. బహదూర్ గ్రూప్కు చెందిన కల్నల్ మాలిక్ నేతృత్వంలో ఏప్రిల్ 14న మొదటిసారిగా భారత ప్రధాన భూభాగంలోని మొయిరాంగ్ (మణిపూర్) వద్ద ఐఎన్ఏ జెండాను ఆవిష్కరించారు. ఇక్కడే మూడు నెలలు సైనిక పాలన నిర్వహించారు. ప్రస్తుతం మొయిరాంగ్లో ఐఎన్ఏ మెమోరియల్ కాంప్లెక్స్ ఉంది. 1944లో హింద్ ఫౌజ్ సైన్యం కోహిమా దండయాత్రలో భాగంగా చలో ఢిల్లీ, జైహింద్ నినాదాలతో ఢిల్లీని ఆక్రమించి బ్రిటిష్ పాలనను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, 1944లో జపాన్ దళాల నుంచి సరైన సహకారం ఐఎన్ఏకు అందకపోవడంతో 1945 మేలో బ్రిటిష్ వారు రంగూన్ను ఆక్రమించారు. ఈ ఆక్రమణతో ఐఎన్ఏ సైనికులు బ్రిటిష్ వారికి యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. దీంతో భారత జాతీయ సైన్యం సాగించిన స్వాతంత్ర్య పోరాటం ముగిసింది.
ఎర్రకోట విచారణ
భారత జాతీయ సైన్యానికి చెందిన యుద్ధ ఖైదీలను బ్రిటిష్ వారు 1945 నవంబర్ 5న ఎర్రకోట వద్ద విచారణ చేశారు. దీన్నే ఐఎన్ఏ విచారణ లేదా ఎర్రకోట విచారణ అంటారు. ఇందులో ప్రేమ్ కుమార్ సెహెగల్, షా నవాజ్ ఖాన్, గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్లు నిందితులుగా ఉన్నారు. వీరిని విడుదల చేయాలని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీ, జస్టిస్ పార్టీ విజ్ఞప్తి చేశాయి. వీరి తరఫున భూలాభాయ్ దేశాయ్ తేజ్బహదూర్ సఫ్రూ, కెలాస్నాథ్ కట్జు, జవహర్లాల్ నెహ్రూ, అరుణా అసఫ్ అలీ వాదించారు. ఈ విచారణ నవంబర్ 5 నుంచి 11 వరకు వారం రోజులపాటు జరిగింది. దీన్నే ఐఎన్ఏ వారం అంటారు. నవంబర్ 12ను ఐఎన్ఏ దినంగా పరిగణించారు. చివరికి 1945 డిసెంబర్ 13న యుద్ధ ఖైదీల విచారణ ముగిసింది. ముగ్గరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయితే ఆనాటి భారత్ సర్వసైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ క్లాడ్ అచిన్లేకన్ బ్రిటిష్ ప్రధాని అట్లీని ఒప్పించి, శిక్షలు రద్దు చేయించారు.
ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రధాన కేంద్రాన్ని సుభాష్ చంద్రబోస్ సింగపూర్ లో స్థాపించాడు