
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారు మాత్రం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించడం లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.
ఒకవేళ కేంద్రం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించినట్టయితే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబద్లోని ఏదైనా కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశముంది. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక లేదా మహారాష్ట్రలో జాతీయ జెండాను ఎగురవేసే చాన్స్ ఉంది. రెండు, మూడు రోజుల్లో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. ఇది కుదరనిపక్షంలో సెప్టెంబర్ 17న నిజామాబాద్లో బీజేపీ భారీ ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు.