
ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని సీతా నవమిగా జరుపుకుంటారు. ఆ రోజే సీతమ్మ జన్మించిందని భావిస్తారు. ఈ ఏడాది సీతానవమి మే 5 వ తేది సోమవారం వచ్చింది. దీనినే జానకి నవమి అనికూడా అంటారు. శ్రీరామనవమికి శ్రీరాముడి జన్మ కథ చెప్పినట్టుగానే జానకీ నవమి రోజు కూడా సీతమ్మ జన్మదిన కథ గురించి వివరిస్తారు.
సీతారాధనకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన పండుగలలో జానకి జయంతి ఒకటి. వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్న యువతీ, యువకులు సీతా నవమి ( మే 5) రోజున సీతామాతను, శ్రీరాముడిని కలిసి పూజిస్తే త్వరలో వివాహం జరుగుతుందని చెబుతారు. ఈ పూజతో పాటు, వివాహితుల వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది, వారు ఆనందం, శాంతి, శ్రేయస్సు పొందుతారు.
వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్న వారు కూడా సీతాజయంతి రోజున సీతారాములను ఆరాధించి... ఉపవాసం చేస్తే తప్పకుండా అడ్డంకులన్నీ తొలగిపోయి వివాహం జరుగుతుందని చెబుతారు. శ్రీ జానకి రామాభ్యామ్ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తరువాత సీతా నవమి కథను భక్తి శ్రద్దలతో చదువుకోవాలి. సాయంత్రం వరకు ఉపవాసం చెయ్యాలి. సాయంత్రం జానకీ మాతకు దీపం వెలిగించి పూజ అనంతరం సీతారాములకు పాలు బెల్లంతో చేసిన వంటలను నివేదించిన తర్వాత ఉపవాసం విరమించాలి.
Also Read : ఆరోజు సీతమ్మ తల్లిని ఎలా పూజించాలి..ఏది నైవేద్యం సమర్పించాలి...
ఈ పూజను దంపతులిద్దరూ కలిసి జరుపుకోవడం వల్ల వారి మధ్య అనురాగం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పండుగను ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. సీతా జయంతిని భక్తిగా జరుపుకునే వారికి ఆనందదాయకమైన దాంపత్య జీవితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
జానకి జయంతి రోజున సీతమ్మను కొలిచేవారు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారని భక్తులు నమ్ముతారు. ఈ పర్వదినం రోజున ఉపవాసం ఉంటే దంపతులు వారి వైవాహిక జీవితం నుంచి అన్ని కష్టాలను తొలగుతాయని, సీతా దేవత వారికి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని .. పెళ్లికాని వారికి మంచి వివాహ సంబంధం కుదురుతుందని నమ్ముతారు.
సీతా నవమి కథ
శ్రీరాముడు యఙ్ఞ ఫలంగా జన్మించిన విధంగానే ..ఆయన భార్య సీతాదేవి పుట్టుకకు కూడా కారణాలున్నాయని పురాణాత ద్వారా తెలుస్తుంది. సీతాదేవి పుట్టక ముందు మిథిలా నగరం ప్రజలు అనేక కష్టాలను .. ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరువు కాటకాలతో మిథిలా నగర ప్రజలు అల్లాడిపోయారు.. ఇలా ఉండగా.. మిథిలానగరం రాజు జనకమహారాజుకు ఓ రుషిపుంగవుడు.. యఙ్ఞం చేస్తే కరువు.. కాటకాల నుంచి బయటపడతారని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఆ రుషి ఆదేశాల మేరకు యఙ్ఞం చేయడానికి భూమిని శుభ్రం చేసేందుకు దున్నుతుండగా..నాగలి చాలుకు ఓ పెట్టె దొరికింది. ఆ పెట్టెలో అందమైన ఆడశిశువు ఉంది. ఆమె సీతాదేవి. అందుకే సీతాదేవిని అయోనిజ అంటారు. అంటే తల్లి గర్భంనుంచి జన్మించలేదు అని అర్దం. ఇక ఆ చిన్నారి రాకతో మిథిలా నగరం సస్యశ్యామలం అయింది. ప్రజల ఇబ్బందులు .. సమస్యలు పరిష్కారమయ్యాయి. మిథిలా నగరంలో ప్రకృతి పులకరించిపోయింది. అప్పటివరకూ కరవుతో అల్లాడిన ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుసింది. అప్పటి నుంచీ కరవు అనే మాట మిథిలానగరంలో వినిపించలేదు. అప్పటినుంచి మిథిలానగర ప్రజలు సంతోషంగా గడిపారని పండితులు చెబుతున్నారు. చాలా దేవాలయాల్లో ఈ కథను సీతానవమి రోజున చెబుతారు పండితులు.