ఏడాదిన్నరలో వ్యవసాయానికి రూ.80 వేల కోట్లు : మంత్రి దామోదర రాజనర్సింహ

ఏడాదిన్నరలో వ్యవసాయానికి  రూ.80 వేల కోట్లు : మంత్రి దామోదర రాజనర్సింహ
  • మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు: ఏడాదిన్నరలో వ్యవసాయాభివృద్ధికి రూ.80 వేల కోట్లు కేటాయించామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం ఆయన ఆందోల్ వ్యవసాయ క్లస్టర్ సంగుపేట గ్రామంలోని  రైతు వేదికలో నిర్వహించిన రైతు పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.  మంత్రి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 3,12,879 మంది రైతుల ఖాతాల్లో రూ.383.48 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. సన్నధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్, రూ .2 లక్షల రుణమాఫీ లాంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

 జిల్లాలో రైతు భరోసా 95 శాతం మంది రైతులకు అందజేసినట్లు త్వరలో మిగిలిన ఐదు శాతం మంది రైతులకు కూడా అందిస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రైతు భరోసా పొందిన రైతులు డబ్బులను ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి బంగారు పంటలు పండించాలన్నారు. కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, డీఏవో శివప్రసాద్, ఆర్డీవో పాండు, అధికారులు రైతులు, రైతు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.