
కరోనా వైరస్ పేరుతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ గుర్తించిన నేపథ్యంలో మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు వైద్య, ఆరోగ్య శాఖ తోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ సరైన వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో వచ్చిన ఇతర వైరస్ లతో పోలిస్తే.. కరోనా వైరస్ లో మరణాల రేటు అతి తక్కువగా ఉందన్నారు. వైరస్ వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్న మంత్రులు .. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం గా ఉన్నాయన్న ఈటెల..పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరస్ కి సంబంధించి ప్రజలను చైతన్యం చేసే పాజిటివ్ ప్రచారం నిర్వహించాలన్నారు. ఇందుకోసం సమాచార మరియు ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని చెప్పారు. తెలుగు ,ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పించే సమాచారం అందించాలి. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వైరస్ సమస్యని ఉపయోగించుకొని ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.