సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సంజయ్ జాజు రేపు జూలై 1న తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ జూన్ 30న ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణా రావు పదవి విరమణ చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సంజయ్ జాజును నియమిస్తూ జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం సీఎస్గా కొనసాగుతున్న కే రామకృష్ణారావు జూన్ 30న పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది. ఆయన 2029 ఫిబ్రవరిలో రిటైర్ కానున్నారు. దీంతో దాదాపు రెండున్నర ఏండ్లకు పైగా రాష్ట్ర సీఎస్ గా కొనసాగనున్నారు.
కొత్త సీఎస్కు అత్యంత కీలకమైన పరిశ్రమలు, సమాచార, సాంకేతికత, కమ్యూనికేషన్ల (ఐటీఈ అండ్ సీ) శాఖల పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. వీటితోపాటు సీఎంవో పరిధిలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఈవో, అలాగే ప్రతిష్టాత్మకమైన 'స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ' (స్పీడ్) విభాగాల పూర్తి అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఆయనకున్న పూర్వ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
