ఫిబ్రవరి నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగవచ్చునన్న ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికలు ఫిబ్రవరి నెలలో ఉండవచ్చునని తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన నేతలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఫిబ్రవరి నెలలోనే జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి పట్టుమని 15 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు అన్ని పార్టీలు లోక్ సభ ఎన్నికలకు రెడీ అయిపోవాల్సిన టైమ్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష పార్టీకి పరిమితమైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొంది పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది. ఇప్పటికే గెలిచిన చోట సభలు పెట్టి కార్యకర్తలకు నేతలకు పార్లమెంట్ ఎన్నికలు సిద్దంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు నాయకులు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే జోష్ తోనే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చూస్తుంది. గత పార్లమెంట్ ఎన్ని్కల్లో మూడు సీట్లను గెలుచుకున్న ఆపార్టీ ఈ సారి 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవాలని చూస్తుంది. ఇప్పుడు సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇక్కడ మెజార్టీ సీట్లలో గెలిచి కాంగ్రెస్ ను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచనలో ఉంది.
ఇక బీజేపీ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించి పార్లమెంట్ ఎన్నికలకు సిద్దమవుతుంది. గత పార్లమెంట్ ఎన్ని్కల్లో నాలుగు సీట్లను గెలుచుకున్న ఆపార్టీ ఈ సారి అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఒంటరిగానే పోటీ చేస్తామని, సర్వేలకు అందని ఫలితాలు ఉంటాయని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర నాయకత్వం గట్టి విశ్వాసంతో ఉంది.