పేర్లు మార్చి.. ఏమార్చిండు! ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్రావు ఎత్తులు.. గుర్తించిన సిట్

పేర్లు మార్చి.. ఏమార్చిండు! ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్రావు ఎత్తులు.. గుర్తించిన సిట్
  • నోట్​ఫైల్ ముందు పేజీల్లో మావోయిస్టుల పేర్లు, తర్వాతి పేజీల్లో పొలిటికల్​ లీడర్ల పేర్లు
  • ప్రముఖుల ఫోన్ నంబర్లను మావోయిస్టు సానుభూతిపరుల లిస్టులో పెట్టి ట్యాపింగ్​కు పర్మిషన్లు
  • రెగ్యులర్ ప్రొసీజర్‌‌లో భాగంగా అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీ
  • రివ్యూ కమిటీ, డీవోటీని ఎస్‌ఐబీ బురిడీ కొట్టించిందన్న మాజీ సీఎస్ శాంతికుమారి
  • వందల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు.. పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్న సిట్​

హైదరాబాద్‌‌, వెలుగు: స్పెషల్‌‌ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌ (ఎస్‌‌ఐబీ) చీఫ్ ప్రభాకర్‌‌‌‌ రావు పక్కా ప్లాన్​ ప్రకారమే ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు అనుమతులు సంపాదించినట్లు తెలుస్తున్నది. మావోయిస్టులు, వారి సానుభూతిపరుల పేరుతో రివ్యూ కమిటీకి పంపిన నోట్‌‌ఫైల్‌‌లోనే మాయ చేసినట్లు తాజాగా సిట్ గుర్తించింది. రివ్యూ కమిటీతో పాటు డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికమ్యూనికేషన్స్‌‌(డీవోటీ)ను కూడా ఎస్‌‌ఐబీ బురిడీ కొట్టించినట్టు ఆధారాలు సేకరించింది. ఈ మేరకు మాజీ సీఎస్ శాంతికుమారి మే నెలలో ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. రివ్యూ కమిటీ అప్రూవల్స్ కోసం తమ దగ్గరకు వచ్చిన నోట్‌‌ఫైల్‌‌ లిస్టులో మొదటి రెండు పేజీలు మావోయిస్టుల పేర్లు కాగా.. మిగితా పేజీల్లో పేర్లు మార్చి రివ్యూ కమిటీని తప్పుదోవపట్టించారని సిట్‌‌కు ఆమె సమాచారమిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభాకర్ రావు సిట్​ముందు విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు వందల సంఖ్యలో ఫోన్​ట్యాపింగ్​బాధితుల నుంచి సిట్​ వాంగ్మూలాలు సేకరిస్తుండడం రాజకీయ, అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఎస్‌‌‌‌ఐబీ నుంచి రివ్యూ కమిటీకి నోట్‌‌‌‌ఫైల్‌‌‌‌ ఇలా
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌‌‌(ఎస్‌‌‌‌ఐబీ) చీఫ్‌‌‌‌గా బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో ప్రభాకర్ రావు.. మావోయిస్టులు, వారి సానుభూతిపరుల పేర్లు, ఫోన్​ నంబర్లతో నోట్​ఫైల్​ సిద్ధం చేసేవాడు. దాన్ని సీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా, జీఏడీ సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్‌‌‌‌ చీఫ్‌‌‌‌ మెంబర్లుగా ఉన్న రివ్యూకమిటీకి  పంపేవాడు. రాష్ట్ర అంతర్గత భద్రత, శాంతిభద్రతలకు సంబంధించి నిఘా వర్గాలు సేకరించిన మావోయిస్టులు, వారి సానుభూతిపరులు, అనుమానితుల పేర్లు, ఫోన్​ నంబర్లు ఉండేలా మొదట్లో జాగ్రత్తలు తీసుకున్నాడు. రివ్యూ కమిటీ నుంచి వచ్చిన లిస్టునే డీవోటీ ఓకే చేసేది. ఆయా లిస్టుల్లోని  ఫోన్ నంబర్లను సంబంధిత టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ల ద్వారా ట్యాప్​చేసేవారు. ఆరు నెలల తర్వాత  ఆయా ఫోన్‌‌‌‌ నంబర్లతో ఉన్న డేటాను రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు తొలగించేవారు. కొన్ని నెలలపాటు ఈ వ్యవహారం సజావుగానే  సాగడంతో రివ్యూ కమిటీకి ఎలాంటి అనుమానం రాలేదు. దీంతో ప్రభాకర్​రావు క్రమంగా బీఆర్ఎస్​ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్​కుట్రకు తెరతీశాడు. 

వందల సంఖ్యలో సాక్షులు
ఫోన్ ​ట్యాపింగ్​ కేసు దర్యాప్తులో సిట్‌‌‌‌ కీలక సాక్ష్యాలను సేకరిస్తున్నది. కేసుల తీవ్రతను బట్టి ముఖ్యసాక్షులు, బాధితులు సహా  సగటున 30 మందికి మించి వాంగ్మూలాలను రికార్డు చేయరు. కానీ, ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాత్రం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌‌‌ సహా అన్ని పార్టీల నేతలు, ఐఏఎస్​లు, ఐపీఎస్​లతో పాటు ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరి వాంగ్మూలాన్ని సిట్‌‌‌‌ రికార్డు చేస్తున్నది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  బాధితులు చెప్పే వివరాల ఆధారంగా నేరతీవ్రతకు అద్దంపట్టేలా అత్యంత పకడ్బందీగా చార్జీషీట్‌‌‌‌ దాఖలు చేసేందుకే ఇంతమంది నుంచి సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు సిట్​ అధికారులు చెప్తున్నారు. 

మరోవైపు ఈ కేసులో ప్రస్తుత సీఎం రేవంత్‌‌‌‌, ఆయన కుటుంబ సభ్యులు, జడ్జీలు, ప్రముఖ రాజకీయ నేతలు సహా ఐఏఎస్‌‌‌‌లు, ఐపీఎస్‌‌‌‌లు, వ్యాపారవేత్తలు, మహిళలు బాధితులుగా ఉండడం.. నిందితులంతా మాజీ పోలీస్ అధికారులే కావడం, గత ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకే జరిగిందని వారు చెప్పడంతో కేసును అత్యంత పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నామని వివరిస్తున్నారు. పక్కా ఆధారాలు ఉన్నందునే నలుగురు పోలీస్ అధికారులకు బెయిల్‌‌‌‌ లభించకుండా 10 నెలల పాటు జైలుకే పరిమితం చేశామని పేర్కొంటున్నారు.  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ కోర్టు బోనులో నిలబెట్టేందుకే పక్కా ఆధారాలతో పాటు పెద్దసంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నామని స్పష్టంచేస్తున్నారు. 

నమ్మకం కుదిరేదాకా..
ఎస్​ఐబీ చీఫ్​ హోదాలో తన నుంచి వచ్చే నోట్‌‌‌‌ఫైల్స్​సహా ఇతర ఫైళ్లపై రివ్యూ కమిటీకి నమ్మకం కుదిరేదాకా ప్రభాకర్​రావు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇదంతా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌ లో భాగమేనని పైఅధికారులను నమ్మించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే నోట్‌‌‌‌ఫైల్స్​లో మావోయిస్టుల నంబర్ల మాటున పొలిటికల్ ​టార్గెట్లను చేర్చినట్లు  సిట్‌‌‌‌ గుర్తించింది. ‘‘ప్రభాకర్​రావు అండ్​ కో.. రివ్యూ కమిటీకి పెట్టే  నోట్‌‌‌‌ఫైల్‌‌‌‌ లిస్టులో మొదటి రెండు పేజీల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరుల పేర్లను  పొందుపరిచేవారు.. ఆ తర్వాతి పేజీల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ టార్గెట్స్‌‌‌‌ ఫోన్​నంబర్లు ఉంచేవారు.. కానీ ఆయా ఫోన్​నంబర్ల ముందున్న పేర్లు మార్చేవారు.. 

కాంగ్రెస్ , బీజేపీ ముఖ్యనేతలు, వాళ్ల అనుచరులు, జడ్జీలు, ఐఏఎస్​లు, ఐపీఎస్​లు, ఇతర టార్గెట్ల నంబర్లకు ముందు దొంగ పేర్లు పెట్టి ట్యాపింగ్​కు పర్మిషన్​ పొందారు..’’ అని సిట్​లోని ఓ అధికారి  తెలిపారు. ఆయా నంబర్ల పక్కన రిమార్క్స్​ కింద సంబంధిత వ్యక్తి మావోయిస్టులకు ఫండింగ్​ చేస్తున్నాడనో, షెల్టర్​ ఇస్తున్నాడనో పేర్కొనేవారని ఆయన వివరించాడు. ఇలా వచ్చిన నోట్‌‌‌‌ఫైల్స్​రెగ్యులర్​ ప్రాసెస్​లో భాగమని అప్పటికే నమ్మించడంతో రివ్యూ కమిటీ కూడా గుడ్డిగా ఆమోదించినట్లు  సిట్‌‌‌‌ గుర్తించింది. దీంతో రివ్యూ కమిటీలో   శాంతికుమారి సహా సభ్యుల నుంచి ఇప్పటికే ఒకసారి స్టేట్​మెంట్​తీసుకున్న సిట్​అధికారులు.. మరోసారి వారి వాంగ్మూలం రికార్డు చేసేందుకు సిద్ధమవుతున్నది.