సైబర్​ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు భేష్

సైబర్​ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు భేష్
  •     మినిస్ట్రీ ఆఫ్​ హోం అఫైర్స్​ స్పెషల్ ​సెక్రటరీ శివగామి

గచ్చిబౌలి, వెలుగు: సైబర్​ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసుల పనితీరు బాగుందని మినిస్ట్రీ ఆఫ్​ హోం అఫైర్స్(ఇంటర్నల్​సెక్కూరిటీ)​ స్పెషల్​సెక్రటరీ శివగామి సుందరి నంద అన్నారు. సైబర్ క్రైమ్​కట్టడికి ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్​ పోలీస్​ సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్స్​ ఫర్​ సైబర్ ​సేఫ్టీని గురువారం ఆమె సైబరాబాద్​ కమిషనరేట్​ ఆఫీసు​లో డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​రవీంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టీఏసీ, ఓపీఎస్​ యూనిట్లు, సైబర్​అకాడమీ, పాలసీ అడ్వకసీ, సైబర్​ ల్యాబ్ ను విజిట్​చేసి.. అందిస్తున్న సేవల గురించి అక్కడ పనిచేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వ్యక్తుల ఆధారిత ప్రత్యేక చొరవ కంటే.. ప్రక్రియ ఆధారిత చొరవ ప్రశంసించదగిందని, తెలంగాణ పోలీసులు దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని తెలిపారు. దేశంలో ఇదే మొదటిసారని ఆమె చెప్పారు. ఈ చొరవ వలన సైబర్​వ్యవస్థలో తెలంగాణ స్టేట్​ సురక్షితంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్​ సీపీ అవినాశ్​మహంతి, ట్రాఫిక్​ జాయింట్ ​సీపీ నారాయణ్​ నాయక్,  డీసీపీలు పాల్గొన్నారు.