
హైదరాబాద్, వెలుగు: ఎన్కౌంటర్ విషయం తెలుసుకున్న జనం ఉదయమే చటాన్పల్లి బ్రిడ్జికి భారీగా తరలివచ్చారు. ‘సీపీ సజ్జనార్ జిందాబాద్.. తెలంగాణ పోలీస్ జిందాబాద్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బ్రిడ్జి కింద పోలీసులు విచారణ సాగిస్తుండగా పైనుంచి పూలు చల్లారు. చప్పట్లతో హర్షం ప్రకటించారు. ఇదే జనం.. ఆరురోజుల క్రితం షాద్నగర్ పోలీస్స్టేషన్లో నిందితులు ఉన్నట్లు తెలుసుకొని స్టేషన్ను ముట్టడించారు.
విచారణలో పోలీసుల తీరును నిరసిస్తూ.. వెంటనే నిందితులను చంపేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితులను చర్లపల్లికి తరలిస్తుండగా పోలీసులపై రాళ్లు, చెప్పలు విసిరారు. ఇప్పుడు ఆ నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో హర్షం ప్రకటించారు. పూల వర్షం కురిపించారు.