- బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు అక్కడే
- ఢిల్లీలోనే కిషన్రెడ్డి, ఈటల, రాజగోపాల్రెడ్డి
- ఇయ్యాల పొంగులేటి, జూపల్లి,
- హస్తిన టూర్లో కేటీఆర్.. ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో నిమగ్నం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు అక్కడ మోహరించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారమే ఢిల్లీకి వెళ్లి వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. పనిలో పనిగా బీఆర్ఎస్ వ్యవహారాలను కూడా ఆయన చక్కబెట్టేస్తున్నారనే చర్చ నడుస్తున్నది. తెలంగాణ బీజేపీలోని వరుస పరిణామాలపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా ఇతర నేతలను పార్టీలోకి ఆహ్వానించింది. వీళ్లతోపాటు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరందరితో సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇప్పటికే పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ను కొందరు నేతలు వీడుతారన్న ప్రచారంపైనా ఆ పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది.
బీఆర్ఎస్ అసంతృప్తులపై కాంగ్రెస్ గురి
రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ నెలాఖరులో, లేదా డిసెంబర్ ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవడంతో పాటు ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నది. అక్టోబర్ రెండో వారంలోనే అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశముందని అధికారవర్గాల్లో చర్చ సాగుతున్నది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మూడోసారి గెలిచి మళ్లీ అధికారం చేపట్టాలని కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటక ఎన్నికల్లో భారీ విజయం తర్వా త తెలంగాణ కాంగ్రెస్లోనూ హుషారొచ్చింది.
రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించేది తామేనని ధీమా వ్యక్తం చేస్తున్నది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. భాగంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది. వారితో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం రాత్రి సమావేశమయ్యారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీదున్న కాంగ్రెస్ తెలంగాణలోనూ పట్టు సాధించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నది.
రూట్ మార్చిన బీఆర్ఎస్
రెండున్నరేండ్లుగా కేంద్ర ప్రభుత్వ మీటింగ్లకు దూరంగా ఉంటూ వస్తున్న కేసీఆర్ సర్కారు ఇప్పుడు రూట్ మార్చింది. మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీలో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో బీఆర్ఎస్ ప్రతినిధిగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేయలేదు. కానీ, ఇప్పుడు అమిత్షా సహా పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగి ఢిల్లీకి వెళ్లారు. శనివారం రాత్రి అమిత్షాతో భేటీ కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో సమావేశం రద్దయింది.
పరిస్థితులు చక్కదిద్దే పనిలో బీజేపీ
దుబ్బాక బైపోల్లో గెలుపు జోష్తో బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రేకులు వేసింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఘన విజయం బీజేపీకి మరింత ఊపుతెచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయినా పార్టీ బలం గణనీయంగా పెరిగింది. అయితే.. కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో కాస్త స్తబ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ అలర్టయింది. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కిషన్రెడ్డి, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో నడ్డా భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుత పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఇతర అంశాలపై వారితో ఢిల్లీ పెద్దలు చర్చించినట్టుగా సమాచారం.