భారత్ ఫ్యూచర్ సిటీలో ఇయ్యాల, రేపు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు అంతా రెడీ అయ్యింది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలోని 100 ఎకరాల ప్రాంగణాన్ని డిజిటల్ హంగులతో ముస్తాబు చేశారు. సమ్మిట్ నేపథ్యంలో దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ను అందంగా అలకరించారు. సిటీలోని చారిత్రక కట్టడాలపై ఆదివారం రాత్రి త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్తో రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ప్రదర్శించారు.
రైజింగ్ తెలంగాణ విజన్ లక్ష్యాలు అందరికీ అర్థమయ్యేలా మెట్రో పిల్లర్లు, రహదారుల వెంట డిస్ ప్లేలు ఏర్పాటు చేశారు. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ప్రదర్శించారు. సమిట్కు వచ్చే అతిథులకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టును ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఎయిర్పోర్టు నుంచి సమిట్ వేదిక వరకు వెళ్లే రోడ్డుపై భారీ డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లు ప్రదర్శించారు. అలాగే అతిథులకు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. – వెలుగు, హైదరాబాద్ సిటీ
