- ఆమ్దానీ పెంచుకునేందుకు కొత్త స్కీమ్
- ఈ సారి సంక్రాంతికి నో ఎక్స్ట్రా చార్జీలు
- టీఎస్ఆర్టీసీ బస్సులే ఎక్కుతున్న ఏపీ జనం
హైదరాబాద్, వెలుగు: పండగకు సొంతూరికి వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. 30 మంది ఉంటే చాలు ఇంటి వద్దకు బస్సు పంపించే ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లోని ఏ ప్రాంతం నుంచైనా ఊరెళ్లేందుకు బుక్ చేసుకుంటే బస్సు వారి ఏరియాకే వస్తుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వరుస సెలవులు, సంక్రాంతి పండుగ దృష్ట్యా జనమంతా సొంతూర్లకు వెళ్తున్నారు. హైదరాబాద్లోని అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీతో కరోనా వ్యాప్తి చెందే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్గా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక అధికారులు, పోలీస్ స్టాఫ్ను నియమించిన ఆర్టీసీ.. బస్సుల సమాచారం, టికెట్ ధర, టైం తదితర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.
టీఎస్ఆర్టీసీ బస్సులకే ప్రయారిటీ..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాధారణంగా సంక్రాంతి పండుగ టైమ్లో ప్రత్యేకం పేరుతో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ ఈ సారి చార్జీలు పెంచలేదు. హైదరాబాద్లో ఉంటున్న అధిక శాతం మంది ఆంధ్రా ప్రజలు సంక్రాంతికి ఏపీకి వెళ్తారు. సాధారణంగా గతంలో వారు ఏపీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. ఈసారి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ చార్జీలు ఉన్న తెలంగాణ బస్సులకే జనం ప్రయారిటీ ఇస్తున్నారు.
అదనపు చార్జీలు లేకున్నా మంచి కలెక్షన్..
టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అదనపు బాదుడు లేకుండా ఆర్టీసీకి మంచి కలెక్షన్ సమకూరుతోంది. కొన్ని రోజులుగా రోజుకు రూ. 8 నుంచి 9 కోట్ల కలెక్షన్ మాత్రమే వస్తోంది. కానీ ఈ నెల 7వ తేదీన రూ. 12 కోట్లు దాటింది. 66.2శాతం ఆక్యుపెన్సీ, 35 శాతం ఈపీకే (ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్) నమోదైంది. 8వ తేదీన రూ.11 కోట్లు దాటింది.పండుగ సమీపిస్తుండటంతో ఆదాయం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు..
స్టేషన్ నంబర్
రెతిఫైల్ బస్ స్టేషన్ 99592 26154
కోఠి బస్ స్టేషన్ 99592 26160
జూబ్లీ బస్ స్టేషన్ 99592 26246
ఎంజీబీఎస్ 99592 26257