పెండింగ్ ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించాలి : బక్కి వెంకటయ్య

పెండింగ్ ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించాలి : బక్కి వెంకటయ్య
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సిద్దిపేట టౌన్, వెలుగు: జులై నెలాఖరులోగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ ల్యాండ్, అట్రాసిటీస్ కేసులపై కమిషన్ సభ్యులు, అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల సభ్యులతో సమీక్షించారు. జిల్లాలో నమోదైన కేసుల వివరాలను అందించాలని పోలీస్ అధికారులను కోరారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతీ నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే ను నిర్వహించడంతో పాటు,  ప్రతీ మూడు నెలలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాన్ని నిర్వహించి ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాలో కొత్త డీవీఎంసీ సభ్యుల ఎన్నిక కోసం జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో సభ్యుల ఎన్నికకు కలెక్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. 

సిద్దిపేట లో బంజారా భవన్ కోసం అనువైన స్థలాన్ని గుర్తించి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు కమిషన్ కు అందజేయాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు పలు కేసులు, సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. 

కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సీపీ అనురాధ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, లీలాదేవి, శంకర్, ప్రవీణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, అడిషనల్​కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, ఆర్డీవోలు, డీఎస్పీలు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించరా?

మెదక్​ టౌన్: మెదక్​జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించలేరా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్​ బక్కి వెంకటయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ కలెక్టర్ ఆఫీసులో అట్రాసిటీ, ఎస్సీ, ఎస్టీల సమస్యలపై సమావేశం నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు పి.శంకర్, దుబాషి సంజీవ్​, దయాసాగర్, మైసయ్య, రాజు, మురళి జిల్లాలో జరిగిన సంఘటనలు చైర్మన్​ దృష్టికి తీసుకువచ్చారు.  ఈ ఘటనలపై స్పందించిన వెంకటయ్య అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. 

ఆయా కేసుల్లో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఎస్పీ, ఏఎస్పీలను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్  నిధులు పక్క దారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్​ పట్టణంలో అంబేద్కర్ భవనానికి స్ధలం కేటాయించాలని సూచించారు. మెదక్, నర్సాపూర్, నిజాంపేటలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాలను  తిరిగి ప్రతిష్టించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిషన్ సభ్యులు ప్రవీణ్, శంకర్, నీలాదేవి, లక్ష్మీనారాయణ, రాము, బాబునాయక్, డీఎస్​డీవో విజయలక్ష్మి , ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.